వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జగన్, ఆ రాజకీయ లక్షణాలను అందిపుచ్చుకోవడంతో విఫలమయ్యారనేది ఇప్పటికే తేలిన అంశం. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ లో రేగిన ముఖ్యమంత్రి కావాలనే “వాంఛ” ఆయన్ని రోజు రోజుకు దిగజారుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజకీయ నీతితో వ్యవహరించాల్సిన చోట అవగాహనా లోపంతో, ‘నియంత’ ధోరణిని అనుసరిస్తూ తన రాజకీయ భవిష్యత్తును శూన్యం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలకు క్రమంగా బలం చేకూరుతోంది.
రాజకీయ పరంగా జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అవి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండడంతో, అధికార పక్షం కల్పిస్తున్న ఒకటి, అర అవకాశాలను కూడా జగన్ తనకు అనుకూలంగా మార్చుకోలేక చతికిలపడుతున్నారన్న వాస్తవం రాజకీయ విజ్ఞులకు తెలిసిన అంశమే. అమరావతి శంకుస్థాపన వ్యతిరేకతతో మొదలైన జగన్ నియంతృత్వ నిర్ణయాలు ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఏపీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటిలా హైదరాబాద్ లో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంత పరిసరాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి జగన్ నివాసం మరోసారి తెరపైకి వచ్చి, హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జగన్, విభజన జరిగినప్పటికీ హైదరాబాద్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివసించడానికి ఇల్లు దొరికిందేమో గానీ, గత అయిదారు మాసాలుగా జగన్ కు మాత్రం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక్క గృహం కూడా అనువైనదిగా లేదట. మీడియా వర్గాలు ఎప్పుడూ ఈ ప్రశ్న అడిగినా వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్న జవాబు ఇదే. అయితే బయటకు ఎటువంటి సమాధానం చెప్పినా, పార్టీ నాయకులు అంతర్గతంగా అనేక చర్చలు జరుపుతుంటారు.
ముఖ్యమంత్రి నివాసానికి, ఏపీ సెక్రటేరియట్ కు భవంతులు దొరికనపుడు జగన్ కు మాత్రం ఎందుకు లభించడం లేదు? బహుశా లోటస్ పాండ్ అంత సువిశాల భవంతులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో లేవా? లేక బెంగుళూరు స్థాయిలో 70 గదుల భవనం కోసం వేచిచూస్తున్నారా? ఇవన్నీ కాకపోతే, అసలు జగన్ కు నిజంగా ఏపీలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సుముఖంగా ఉన్నారా? ఈ అతి సామాన్య ప్రశ్నలకు “జవాబులు” అందరికీ తెలిసినవే.
అయితే ఇదే విధంగా జగన్ తన రాజకీయాలను కొనసాగిస్తే, ఇకపై మనుగడ సాగించడం కష్టమన్న మాటలు పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయని తెలుస్తోంది. తన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతారన్న ప్రతి సారి భయపెట్టో, బ్రతిమాలో ఆపగలుగుతున్న జగన్, ముందుగా తన వైఖరిని మార్చుకుంటే, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. బహుశా తను ఎదుర్కొంటున్న కేసులా రీత్యా హైదరాబాద్ లోనే ఉండాలని జగన్ భావిస్తే… ఇక ఆ కేసులతోనే జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుందన్న విమర్శలు సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించి రాజధాని ప్రాంత వాసుల ఆదరణకు దూరమైన జగన్, భవిష్యత్తులో తన నివాసాన్ని మార్చుకోకపోతే ఏపీలో పార్టీ మూతపడే పరిస్థితులు కూడా నెలకొనే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహిరంగ రాజకీయాలు ఎలా ఉన్నా, తెర వెనుక జరిగే రాజకీయాలు ‘ప్రమాదం’ ఏర్పడే వరకు తెలియవు. ‘ప్లేట్లు’ మార్చేయడం నేటితరం రాజకీయ నాయకులకు ‘వెన్నతో పెట్టిన విద్య’ అన్న సంగతి జగన్ కు తెలియనిది కాదు. ఎందుకంటే… జగన్ పార్టీ నిండా ఉన్నవారంతా ఆ కోవకు చెందిన వారన్న సంగతి తెలిసిందే. మరి జగన్ లో ఎప్పటికి మార్పు వస్తుందో… ఏమో..? అసలు వస్తుందంటారా!?






