భారత్ ఇంకా డ్రోన్ టెక్నాలజీ వద్దనే ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు చాలా దూరం వెళ్ళిపోయాయి. అవి తమ శత్రుదేశాలపై యూఏవీ (అన్ మ్యాన్ ఏరియల్ వెహికల్స్)తో నిఘా పెడుతుంటాయి. అవసరమైతే వాటితోనే దాడులు కూడా చేస్తుంటాయి.
భారత్-పాక్ మద్య జరిగిన తాజా యుద్ధంలో భారత్ పైచేయి సాధించినప్పటికీ, గోటితో పోయే దానికి గొడ్డలి వాడినట్లు బ్రహ్మోస్ క్షిపణలు ప్రయోగించక తప్పలేదు. తగినన్ని యూఏవీలు కలిగి ఉంటే మరింత తక్కువ సమయంలో తేలికగా యుద్ధం ముగించగలిగేది.
ఈ కొరతని భర్తీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. మొత్తం 87 మేల్ (మీడియా అల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరన్స్) యూఏవీలు దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. దీని కోసం గ్లోబల్ టెండర్స్ ఆహ్వానించింది.
అయితే ఈసారి అన్నిటి తయారీ బాధ్యత ఒకే కంపెనీకి కాకుండా ఎల్-1గా నిలిచిన కంపెనీకి 64 శాతం, ఎల్-2గా నిలిచిన కంపెనీకి 34 శాతం కేటాయించాలని నిర్ణయించింది.
కనుక రాబోయే ఆరు నెలల్లో వివిధ కంపెనీల మేల్ యూఏవీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత వాటిలో రెండు కంపెనీలను ఎంపిక చేస్తుంది. అవి ఒప్పందం ప్రకారం భారత్లో మేల్ యూఏవీల తయారుచేసే ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం ఏడాది సమయం పట్టవచ్చు.
భారత్ కోరుతున్న ఈ మేల్ యూఏవీలు కనీసం 10 నుంచి 30 వేల అడుగులో ఎత్తులో ఎగురుతూ, 24 గంటలకు పైగా గాల్లోనే ఉండాలని షరతు విధించింది. కనుక అటువంటి మేల్ యూఏవీలను ఉత్పత్తి చేస్తున్న అగ్రరాజ్యాలకు చెందిన కంపెనీలే భారత్లో తమ ప్లాంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.




