రైల్వేశాఖ వేలకోట్లు ఖర్చుచేసి దేశంలో ప్రధాన నగరాలలో రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ స్థాయిలో పునర్మిస్తోంది. అవి రైల్వే స్టేషన్లా లేక అంతర్జాతీయ విమానాశ్రయాలా అన్నట్లు అద్భుతంగా నిర్మిస్తోంది. మరోపక్క సకల సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ రైళ్ళను ఈ నెల నుంచే ప్రవేశపెట్టబోతోంది.
మరో రెండేళ్ళలో అహ్మదాబాద్ నుంచి ముంబాయికి దేశంలో మొట్ట మొదటి బుల్లెట్ రైలు కూడా ప్రారంభం కాబోతోంది. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా చాలానే ఉన్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో ఈ దశాబ్దాన్ని సువర్ణ అధ్యాయంగా బావించవచ్చు.
భారతీయులు ఎన్నో దశాబ్దాలుగా ఇటువంటి అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సామాన్య ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఏం చేస్తోంది?అనే ప్రశ్న నేటికీ వినిపిస్తూనే ఉంది.
సంక్రాంతి పండుగకు విపరీతమైన రద్దీ ఉంటుంది. కనుక పండగకి ప్రత్యేక రైళ్ళు వేశామని ద.మ.రైల్వేశాఖ ప్రకటించి చేతులు దులుపుకుంది. కానీ బోగీలలో కనీసం నిలబడేందుకు కూడా జాగా లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతుంటే, ‘మీ ప్రయాణం సుఖవంతం అవుగాక’ అని అనడం వెటకారం కాకపోతే మరేమిటి?
పండుగలకు రద్దీ సహజం కనుక రెండు నెలల ముందే రిజర్వేషన్స్ చేసుకుందామన్నా టికెట్స్ దొరకవు. తత్కాల్ పేరుతో జరుగుతున్న దోపిడీకి అంతే లేదు. టికెట్ క్యాన్సిలేషన్ మరో రకమైన దోపిడీ.
వీటన్నిటికీ సిద్ధపడి ఆన్లైన్లో టికెట్స్ రిజర్వేషన్స్ చేసుకుందామంటే అదో పెద్ద ప్రహసనం. సామాన్య ప్రజలు, వృద్ధులు ప్రయత్నిస్తే వారికి బీపీ పెరుగుతుంది. డబ్బు బ్లాక్ అవుతుంది తప్ప టికెట్స్ మాత్రం లభించవు.
వందే భారత్ రైళ్ళను ప్రవేశపెట్టడంపై ఉన్న శ్రద్ధ, జనరల్ బోగీలతో కూడిన ప్యాసింజర్ రైళ్ళపై ఎందుకు పెట్టడం లేదు. సామాన్య ప్రజలను గాలికొదిలేసి, డబ్బు ఖర్చు చేయగల వర్గం ప్రజలు మాత్రమే ముఖ్యమని రైల్వేశాఖ భావిస్తోందా? పేద, సామాన్య ప్రజలు రైలు ప్రయాణాలు మానుకోవాలని కోరుకుంటోందా?అందుకే ప్యాసింజర్ రైళ్ళని క్రమంగా తగ్గిస్తూ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ళ సంఖ్య పెంచుతోందా?అనే సందేహం కలుగుతోంది.
సికిందరాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతున్న రైళ్లన్నీ కిక్కిరిసి వెళుతుంటే అది రైల్వేశాఖకి గొప్పగా అనిపించవచ్చు. కానీ ఆ రైళ్ళు, వాటిలో నిలబడేందుకు కూడా జాగా దొరక్క తిప్పలు పడుతున్న ప్రయాణికులే రైల్వేశాఖ అసమర్దతకు నిదర్శనాలు. ఇంద్ర భవనాల వంటి రైల్వే స్టేషన్లు, వందే భారత్ రైళ్ళపై చూపుతున్న శ్రద్ధ ఇలాంటి సమస్యలపై పెడితే సామాన్య ప్రజలు సంతోషిస్తారు కదా!







