ఒక నాయకుడి నాయకత్వ లక్షణాలు, అతడి సామర్ధ్యం అధికారంలో ఉన్నపుడు కన్నా విపక్షంలో ఉన్నప్పుడే బయటకొస్తాయి అనేది రాజకీయాలలో బలంగా వినిపించే ఒక వాదన. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడి రాజకీయ నైపుణ్యం, ప్రజా సమస్యల పై పోరాటం, ప్రభుత్వాన్ని నిలదీసి తత్త్వం అనేది ఆ నాయకుడికి అగ్ని పరీక్ష వంటిది.
అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఇటువంటి అగ్నిపరీక్షనే ఎదుర్కుంటు, అధికార పార్టీల నేతలపై ఎదురుదాడితో రాష్ట్ర రాజకీయాలలో ఎదురీదుతున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష నేత విషయంలో కాస్త అయోమయమే ఎదురవుతుంది.
తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో బిఆర్ఎస్ గొంతు వినిపించాల్సి ఉండగా ఆ బాధ్యతను కేసీఆర్ తనయుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ భుజాన వేసుకున్నారు. పార్టీకి అన్ని తానే అయి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తున్నారు.
అధికార పార్టీ తీసుకునే ప్రభుత్వ నిర్ణయాల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, మీడియాలో, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు, పార్టీ శ్రేణులను అలర్ట్ గా ఉంచుతున్నారు. అయితే కేటీఆర్ విమర్శలు ఎక్కువగా ప్రభుత్వ టార్గెట్ గా, ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి సాగుతుంటాయి.
అందులో హైడ్రా నుంచి కాళేశ్వరం నీటి విడుదల వరకు, రేవంత్ సర్కార్ ఎన్నికల హామీ నుంచి పొరుగు రాష్ట్రాలతో ప్రాంతీయవాద రాజకీయాల వరకు ప్రతి అంశంలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇటు సామాన్య ప్రజానీకానికి అటు రైతు సోదరులకు మద్దతుగా తన గళం విప్పుతున్నారు.
నిరుద్యోగుల సమస్యల నుంచి హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూ వరకు, నీటి ప్రాజెక్టుల నుంచి ఐటీ పరిశ్రమల వరకు ఇలా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ కేటీఆర్ తనదైన శైలిలో నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. తెలంగాణ ప్రతిపక్ష నేత సంగతి ఇలా ఉంటే అటు ఏపీలో ముచ్చట మరోలా ఉంది.
టెక్నికల్ గా చెప్పాలంటే 2024 ఎన్నికల ఫలితాలను బట్టి అసలు ఏపీలో ప్రతిపక్షమన్నదే లేదని చెప్పాలి. వైసీపీ కేవలం 11 సీట్లతో కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయినా కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యర్థిగా ఉన్నది ఒక్క వైసీపీ పార్టీనే కాబట్టి జగన్ కు అనధికార ప్రతిపక్ష నేత హోదా సంక్రమించింది.
అయితే విపక్ష నేత గా ఏపీలో జగన్ పాత్ర విషయానికొస్తే, వైసీపీ 2.0 అంటూ జగన్ చేస్తున్న పరామర్శల యాత్రలు, ఓదార్పు పర్యటనలు, రప్ప రప్ప నినాదాలను బలపరుస్తున్నాయే తప్ప ప్రజా సమస్యల ను వెలికి తీయ్యలేకపోతున్నాయి.
తిరుమల లడ్డు కల్తీ వివాదం మొదలు రాష్ట్ర రాజధానిగా మావిగన్ ప్రకటన వరకు, ఇక టీడీపీ కార్యాలయం మీద దాడికి కారణమైన వల్లభనేని వంశీ నుంచి తాజాగా సిదిరి అప్పలరాజు తనయుడు హిట్ అండ్ రన్ కేసు పరామర్శ యాత్ర వరకు జగన్ పర్యటనలు కేవలం పార్టీ క్యాడర్ ఉత్సహానికే పరిమితం అయ్యాయి తప్ప ప్రజామోదం పొందలేకపోయాయి.
ఈ యాత్రలన్ని పార్టీ పునర్నిర్మాణం కోసం, పార్టీ క్యాడర్ కి భరోసా కోసం, పార్టీ నేతల ఉనికి కాపాడుకోవడం కోసమే పనికొచ్చాయి కానీ వాటివల్ల వైసీపీ కి ఒరిగిన రాజకీయ లబ్ది శూన్యమనే చెప్పాలి. అలాగే జగన్ పర్యటనలు ప్రజా సమస్యల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం అన్న వాదన స్థానికంగా నానాటికి బలపడుతుంది.
దానికి తోడు జగన్ ఏపీలో కంటే కూడా బెంగళూర్ లోనే ఎక్కువ సమయం గడపడం జగన్ కు మరో మైనస్ గా కనిపిస్తుంది. ఇక అన్నింటి కంటే రాష్ట్ర నిర్మాణల విషయంలో జగన్ గతంలో చేసిన ప్రసంగాలకు ప్రస్తుతం ఇస్తున్న ప్రకటనలు పూర్తి భిన్నంగా ఉండడం జగన్ వెనుకబాటుతనానికి మరోకీలక కారణంగా పరిగణించవచ్చు.
ఉదాహరణకు భోగాపురం ఎయిర్ ఫోర్ట్ విషయంలో, విశాఖ డేటా సెంటర్ అంశంలో జగన్ నాటి ప్రసంగాలకు నేటి ప్రకటనలకు అసలు పొంతనే లేకపోవడం కూడా జగన్ విపక్ష నేతగా కేటీఆర్ కంటే వెనుకబడ్డారేమో అనిపిస్తుంది. అలాగే జగన్ పర్యటనలు పార్టీ బలప్రదర్శనకు ప్రచారం గా పనికొస్తుంది కానీ ప్రజా సమస్యల పై పోరాటానికి ఉపయోగపడడం లేదు.
ఇక కేటీఆర్ లో ఉన్న వాక్చాతుర్యం బిఆర్ఎస్ రాజకీయానికి ఆయువు పట్టనే చెప్పాలి. కానీ జగన్ ప్రెస్ మీట్లు సోషల్ మీడియాకు మంచి విందు భోజనం గా మారుతున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకుని చూస్తే ఎక్కడో జగన్, కేటీఆర్ కన్నా ఒకటి రెండడుగులు వెనుకబడ్డారేమో అన్న వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతుంది.




