కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకేక్కబోతున్న “జనతా గ్యారేజ్” సినిమా కోసం సారధి స్టూడియోలో భారీ సెట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సెట్ లో నేటి నుండి షూటింగ్ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ సెట్ ఫోటోలు వెబ్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మహేష్ బాబు ‘ఒక్కడు’ చార్మినార్ సెట్ తరహాలో, జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ కోసం మరో అద్భుతమైన సెట్ సిద్ధమైందని అభిమానులు పండగ హర్షం వ్యక్తం చేసుకుంటున్నారు.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో జూనియర్ కు లభించిన క్రేజ్ తో ‘జనతా గ్యారేజ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పక్కా ప్రణాళికతో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన ఈ సినిమాను ఆగష్టు 12వ తేదీన విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి రోజు షూటింగ్ చేయబోతున్న భారీ సెట్ చూస్తుంటే… ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు.
తాజాగా చేరిన మరో విశేషమేమిటంటే… డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా నటించబోతున్నారు. ‘మిర్చి’లో ప్రభాస్ కు నాన్నగా చేసిన సత్యరాజ్ పాత్ర అదరగా, ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ కు తండ్రిగా నటించిన జగపతిబాబు క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందింది. దీంతో జూనియర్ జనతా గ్యారేజ్ లో సాయికుమార్ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.



