‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి నందమూరి నటసింహం బాలకృష్ణకు, టిడిపి అధినేత చంద్రబాబు వర్గాలకు మధ్య దూరం ఉందన్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో ఈ విషయం ప్రస్పుటమవ్వగా, ఇటీవల జరిగిన “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుక ఈ అంశాలను ఖరారు చేసిందని సినీ వర్గాలలో జరిగిన ప్రచారం తెలిసిందే.
అయితే “నాన్నకు ప్రేమతో” విజయం కోసం ఉన్న దారులన్నింటిని తెరుస్తున్న జూనియర్, ఇటీవల పాత్రికేయులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అలాగే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కూడా అక్కినేని నాగార్జున “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమానికి ‘బుడ్డోడు’ హాజరు కానున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది కూడా!
ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా జూనియర్ వేసిన స్కెచ్ సామాన్య ప్రేక్షకులను పక్కన పెడితే, సినీ వర్గీయులను అవాక్కు చేస్తోంది. ఇప్పటివరకు “నాన్నకు ప్రేమతో” సినిమా పబ్లిసిటీ వరకే ఈ కార్యకమాన్ని వినియోగించుకుంటారని ప్రచారం జరిగినా, తాజాగా వెలుగు చూసిన మరికొన్ని అంశాలు సంచలనాలకు దారి తీసాయి. ఈ కార్యక్రమంలో జూనియర్ గెలుపొందిన 12.50 లక్షలను ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి’కి మరియు ‘ఎన్టీఆర్ ట్రస్టు’కు చెరో సగం విరాళంగా ప్రకటించారని తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ ట్రస్టు ఆసుపత్రి నడుస్తుండగా, ఎన్టీఆర్ ట్రస్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వున్న సంగతి తెలిసిందే! ఈ రెండింటికి విరాళాలు ప్రకటించడం అనేది “నాన్నకు ప్రేమతో” సినిమా విజయానికి మార్గం సుగమం చేసుకోవడమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు నందమూరి వర్గాన్ని, ఇటు తెలుగుదేశం పార్టీ వర్గీయులను ఒక్క కార్యక్రమం “మీలో ఎవరు కోటీశ్వరుడు” ద్వారా ఎన్టీఆర్ బుట్టలో వేయబోతున్నాడని జోరుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది ఈ నెల 10వ తేదీన తేలిపోనుంది. అయితే ఈ విషయం విన్న సినీ జనాలు మాత్రం ‘బుడ్డోడు’ మాంచి ‘ఘటికుడే’ అంటున్నారు.





