ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి అయిన ఆ సినిమాకు ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో మోహన్లాల్ నటించబోతున్నాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ స్పందిస్తూ… అవును మా సినిమాలో మోహన్లాల్ నటించబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు.
మోహన్లాల్ తెలుగు సినిమాలో నటించి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మోహన్లాల్ ఈ సినిమాలో నటించనుండటంతో అందరి దృష్టి కూడా ఈ సినిమాపై ఉంది. ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల దర్శకత్వంలో రాబోతున్న సినిమా కనుక సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలను వచ్చే సంవత్సరం జులైలో పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించనున్నారు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.





