మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మభూషణ్’ పురస్కారం వచ్చిన సమయంలో సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి మెగాస్టార్ ను సన్మానించిన సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన ‘అన్నయ్య –తమ్ముడు’ ఎపిసోడ్ బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎపిసోడ్ ను మరోసారి తలపించే విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ‘అన్నా – తమ్ముడూ’ మాటల యుద్ధం జరుగుతోంది.
“తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లను గెలిపించండి, ఢిల్లీ నుండి రావాల్సిన నిధులను హైదరాబాద్ గల్లీకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది” – నారా లోకేష్.
“అమరావతికే ఏమీ తెచ్చుకోలేకపోయినారు… తెలంగాణాలో ఓ సామెత ఉంది. ‘గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని బయల్దేరినాడట వెనకటికేపుడో.., హైదరాబాద్ సంగతి చూసుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారున్నారు, చంద్రబాబు నాయుడు గారెని చూసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం.., స్టేట్ గెస్టుల్లాగా చక్కగా మీరున్నారు, ఉండండి” – కేటీఆర్.
“32 సంవత్సరాలు హైదరాబాద్ లో పుట్టి పెరిగినోడ్ని, చడ్డీలేసుకుని గల్లీలంతా పరిగెత్తిన లోకేష్ ని, కేటీఆర్ ఎక్కడ పెరిగినాడు… గుంటూరులో పెరిగినాడు…” – నారా లోకేష్.
“మా తమ్ముడు… లోకేష్ ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తాడా? లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తాడా? ఆ విషయం ముందు చెప్పమనండి” – కేటీఆర్.
“అన్నా కేటీఆర్… హైదరాబాద్ ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నీ తాతా? తండ్రా? హైదరాబాద్ పరిపాలనలో కేటీఆర్ ఎప్పుడు భాగస్వామిగా మారారో మర్చిపోయినట్టున్నారని, అధికారం వెలగబెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కు ఏం చేసిందో చెప్పాలి, ప్రచారం పేరుతో ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దు” – నారా లోకేష్.
ఇలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులు మాటల దాడి చేసుకుంటున్నారు. అయితే ఈ మాటల పోరాటంలో ఎవరిది పై చేయి అన్న అంశం రాజకీయ పరంగా చర్చనీయాంశమైంది. ఇరు పార్టీ వర్గాలు తన నాయకుడిదే అంటే తమ నేతదే అంటూ కేటీఆర్, లోకేష్ లకు అండగా నిలబడుతున్నారు. అయితే ఇరువురి రాజకీయ ప్రస్థానాలను పరిశీలిస్తే…
కేసీఆర్ మాదిరే కేటీఆర్ మంచి వాగ్ధాటి. తెలంగాణా ఉద్యమ సమయంలో ఈ వాక్చాతుర్యత ఎంతగానో ఉపయోగపడిన విషయం తెలిసిందే. ప్రత్యర్థులను ఎత్తిచూపే సమయంలో కూడా ‘లాజిక్’లతో ప్రజలను ఆకర్షించే విధానం కేటీఆర్ సొంతం. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున ప్రణాళిక బద్ధమైన తెరవెనుక వ్యవహారాలలో తప్ప ప్రజాక్షేత్రంలో పెద్దగా తన ప్రదర్శన ఇవ్వని నారా లోకేష్ కేటీఆర్ ని ఎలా ఎదుర్కొంటారనే సందేహం పార్టీ వర్గాల్లో కూడా నెలకొంది.
అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ, తన కంటే వయసులోనూ, క్రియాశీలక రాజకీయాల్లోనూ మిక్కిలి అనుభవజ్ఞుడైన కేటీఆర్ ను నారా వారబ్బాయి ధీటుగానే ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లో లోకేష్ రాటు దేలుతున్నాడన్న వ్యాఖ్యలు సర్వత్రా వినపడుతున్నాయి.





