కాపులకు రిజర్వేషన్లే లక్ష్యంగా ఉద్యమ బాట చేపట్టిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు పది రోజులు దాటినా శుభం కార్డు పడలేదు. తుని విధ్వంసకారుల పేరిట పోలీసులు అరెస్ట్ చేసిన 13 మంది కాపు యువకులకు బెయిల్ వచ్చేదాకా తాను దీక్ష విరమించేది లేదని తనతో చర్చలు జరిపిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తేల్చి చెప్పారు.
అయితే ఇప్పటికే 13 మందిలో 10 మందికి బెయిలొచ్చింది కదా, మిగిలిన ముగ్గురికి కూడా మరో రెండు, మూడు రోజుల్లో బెయిల్ వచ్చి తీరుతుందని వారిద్దరూ ముద్రగడకు నచ్చజెప్పే యత్నం చేశారు. ఆమరణ దీక్ష చేపట్టి పది రోజులు పూర్తైన నేపథ్యంలో… కేవలం ఐవీ ఫ్లూయిడ్స్ తోనే ఆరోగ్యం కుదుట పడదని, కీటోన్ బాడీస్ పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదమని వారెంత చెప్పినా దీక్ష విరమణకు ముద్రగడ ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించక ముందే మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.





