“ధనవంతులు మరింత ధనవంతులుగా అవుతూనే ఉన్నారు, పేదలు ఇంకాస్త నిరుపేదలుగా మారుతునే ఉన్నారు.” ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం.’ బహుశా ఈ రెండు వ్యాఖ్యలు లేకుండా ఇండియాను ఊహించుకోలేమేమో! నాలుగైదు దశాబ్దాలుగా భారతదేశంలో అంతర్భాగంలా అయిపోయిన ఈ వ్యాఖ్యలను సవరించే పరిస్థితులు ఇప్పట్లో కనపడడం లేదని చెప్పవచ్చు.
నిపుణులు చెప్పినట్లుగా ఇండియాలో కుబేరుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వరల్డ్ టాప్ – 50 జాబితాలో భారతీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన హవాను కొనసాగిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో చాలా కాలంగా చోటు దక్కించుకుంటున్న ముఖేష్ ఈ ఏడాది కూడా సత్తా చాటారు.
‘వెల్త్- ఎక్స్’ సంస్థ ‘బిజినెస్ ఇన్ సైడర్’తో కలిసి విడుదల చేసిన వరల్డ్ టాప్ 50 కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 24.8 బిలియన్ డాలర్ల ఆస్తి విలువతో 27వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 87.4 బిలియన్ డాలర్లతో అగ్ర భాగాన నిలిచిన ఈ జాబితాలో భారత్ కు చెందిన మరో ఇద్దరు భారతీయ పారిశ్రామిక వేత్తలు కూడా స్థానం సంపాదించారు. విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ 16.5 బిలియన్ డాలర్లతో 43వ స్థానంలో నిలవగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్లతో 44వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇండియాలో కుబేరుల సంఖ్య నానాటికి పెరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసినా, మరో వైపు పేదరికం రూపురేఖలు మారకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీనికి గల కారణాలను విశ్లేషించుకుంటూనే నాలుగైదు తరాలు గడిచిపోయాయి. మరో నాలుగైదు కూడా ఖాయంగా కనపడుతున్నాయి. మరి దీనికి విరుగుడు ఎప్పుడు లభిస్తుందని అని ప్రస్తుత తరం ఆలోచించక పోవడమే సరైన నిర్ణయమా..?





