టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న నారా లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలన్న డిమాండ్లు నానాటికీ పెరుగుతున్నాయి. మొన్నటి ఏపీ కేబినెట్ భేటీలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతానికి ‘మౌనం’ వహిస్తున్నారని సమాచారం. ఒకవేళ లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే… ఆయన కోసం తమ పదవులను త్యాగం చేస్తామని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే విధేయత ప్రకటనలు గుప్పించిన వైనం తెలిసిందే. ఇదే అంశంపై చంద్రబాబు కేబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు.
“చంద్రబాబు తర్వాత నారా లోకేశ్ సీఎం అవుతారా? అయితే ఇంతవరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న మీ పరిస్థితి ఏమిటి?” అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు యనమల కాస్తంత ఇబ్బందిగానే స్పందించారు. నారా లోకేశ్ మంత్రి అవుతారా? సీఎం అవుతారా? అన్న విషయం ఇప్పటికి అప్రస్తుతమే కాక అప్రాధాన్యమని అన్న యనమల, “సీఎం పదవికేముంది… లోకేశ్ కావచ్చు లేదంటే బొడ్డు వెంకటరమణ (ప్రెస్ మీట్ లో ఉన్న స్థానిక మీడియా ప్రతినిధి) అయినా కావచ్చు” అంటూ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేయడం విశేషం. అంతేకాదు, సదరు ప్రశ్నలతో ఇబ్బందిపడ్డ యనమల ఉపయోగపడే ప్రశ్నలు వేయండి అంటూ మీడియా వర్గీయులకు సూచనలు చేసారు.



