ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల (75) సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్, ఉస్మానియా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గత కొన్నేళ్ళుగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె చిన్నప్పటి నుంచే తీవ్ర ఆర్ధిక సమస్యల మద్య జీవిస్తూ జీవిత చరమాంకంలో చేతిలో పావలా కూడా లేకే దుర్భర జీవితం గడిపారు.
ఆమె పరిస్థితి తెలుసుకొని కొందరు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయం అందించారు. కానీ ఆమె పేదరికం, ఆరోగ్య సమస్యలకు అవి ఏమాత్రం సరిపోలేదు. కనుక ఆమె జీవితంలో చివరిరోజులు అత్యంత దయనీయస్థితిలోనే సాగాయి.
ఆమె మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని ఉస్మానియా వైద్యులు చెప్పడం చూస్తే, చనిపోయిన తర్వాత కూడా ఆమెని కష్టాలు వీడలేదనిపిస్తుంది.
సినీ పరిశ్రమలో ప్రముఖులు మరణిస్తే నివాళులు అర్పించేందుకు అందరూ క్యూకడతారు. కొందరు కొందరి అంత్యక్రియలకు కూడా హాజరవుతారు. ప్రభుత్వాలు కూడా అధికారిక లాంచనాలు ప్రకటిస్తుంటాయి.
పావలా శ్యామలకు అవేమీ చేయకపోయినా సినీ పరిశ్రమ ఆమెకు అంత్యక్రియలు జరిపించి సగౌరవంగా సాగనంపితే అందరికీ గౌరవం.
అగ్ర నటులైతేనే స్పందించడం లేకుంటే ఓ ట్వీట్ వేసి ఊరుకోవడం మంచి పద్దతి కాదు. చనిపోయిన తర్వాత కూడా చిన్నా పెద్ద అనే భేదం చూపడం మానవత్వం అనిపించుకోదు. కనీసం ఏపీ లేదా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆమెకు సగౌరవంగా అంతిమ వీడ్కోలు ఏర్పాటు చేస్తే, అదే కళాకారులకు ఇచ్చే అతిపెద్ద అవార్డు. గౌరవం.




