ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్, స్టీల్ బ్రిడ్జిని సిఎం చంద్రబాబు నాయుడు నిన్న ప్రారంభోత్సవం చేయగానే ఎక్కడో మాడిన వాసన గుప్పుమంది. అది వైసీపీ నేతల కడుపు మంట వలన వచ్చిందే.
‘ఓ రోడ్డు, ఓ భవనం కట్టి అదేదో గొప్ప ఘనకార్యం అన్నట్లు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు’ అని పేర్ని నాని కడుపు మంట వెళ్ళగ్రక్కారు. ఎందుకు ఇంత ఆలస్యమైందని నోరు జారి అడిగేసి ‘తూచ్’ అనుకున్నారు.
పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలీదని చెప్పిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఏడేళ్ళుగా అమరావతిని నిర్మిస్తూనే ఉన్నారు. నేటికీ అది పూర్తి కాలేదు. ఎప్పటికీ పూర్తి కాదు. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదు. అదొక అవినీతి, దోపిడీ కేంద్రం,” అంటూ అంబటి రాంబాబు చాలానే మాట్లాడారు.
మావిగన్ అంటూ జగన్ చేసిన కొత్త ప్రతిపాదన కంటే, అమరావతి గురించి మాట్లాడుతున్న ఇటువంటి మాటలతోనే వైసీపీకి ఖచ్చితంగా ఎక్కువ నష్టం జరుగుతుంది. అమరావతిని వారు ఎంతగా ద్వేషిస్తే, ఎంతగా వ్యతిరేకిస్తే అంతగా ప్రజలలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతూనే ఉంటుంది.
ఇదివరకు అమరావతే రాజధాని అని అంగీకరించి అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు చూసిన ప్రజలు, ఇప్పుడు తాము బహిరంగంగా అమరావతిని ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, ప్రజలు మనకి మళ్ళీ అధికారం ఎందుకు ఇస్తారు? అని వైసీపీ నేతలే ఆలోచించుకోవాలి. అమరావతి పట్ల వైసీపీ ప్రదర్శిస్తున్న ఈ ద్వేషమే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష.
ఏది ఏమైనప్పటికీ పార్టీలో అందరూ అమరావతిని వ్యతిరేకించాల్సిందేనని వారి అధినేత స్పష్టం చేశారు కనుక ఇకపై అమరావతిలో ప్రతీ ప్రారంభోత్సవానికి ఇలా కడుపు మంట.. దాంతో మాడిన వాసన వస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఈ వాసన కూడా ప్రజలు భరించక తప్పదు.




