బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ పై ఇటీవల బీజేపీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. దేశంలో ‘అసహనం’పై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ‘‘దేశం వదిలి వెళదామంటూ నా భార్య చెప్పింది’’ అంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపాయి. ఫలితంగా అప్పటిదాకా ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న అమీర్, ఆ తర్వాత ఆ హోదాను కోల్పోవలసి వచ్చింది. అంతే కాదు, ‘ముందుగా నీ భార్యకు చెప్పుకో’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సంచలన వార్తల నేత సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్యస్వామి అమీర్పై కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. గతంలో అమీర్ ఖాన్ నటించిన “పీకే” చిత్ర ప్రమోషన్ కోసం, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారం తీసుకున్నాడని సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలమయ్యాయి. తను పోషించే పాత్రలకు ప్రాణం పోసే అమీర్ పై ఈ నిందలు వ్యక్తం కావడం ఆయన అభిమానులను కలచి వేస్తోంది.





