టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి కింద చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే టీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని కూడా వెల్లడించారు.
కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కష్టపడి పాలన సాగించాలని, ఫాంహౌస్ పాలన కారణంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ లోటు బడ్జెట్ లోకి వెళ్లిపోయిందని నారా లోకేశ్ ఘాటు పదజాలంతో స్పందించారు. గడచిన 45 రోజుల పాలన చూస్తుంటే… కేసీఆర్ ను సొంత పార్టీ నేతలే నిలదీసే పరిస్థితి వస్తుందని, కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని, తెలంగాణలో దొరల పాలనను తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుందని జోస్యం చెప్పారు.
ఇక, టీ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వారిని ఉద్దేశిస్తూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఓ కీలక నేత ఇటీవల తనకు పదే పదే ఫోన్ చేస్తున్న తరుణంలో, ఓ సారి మాట్లాడితే పోలా… అని ఫోన్ ఎత్తి ‘అన్నా బాగున్నావా?’ అని అడగగా… ‘ఏం బాగున్నామన్నా, ఇక్కడేం బాగాలేదు. పార్టీలో చేరే ముందు సీఎం కేసీఆర్ నాతో మూడు గంటల పాటు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా ఇచ్చిండు. ఇగో, ఇప్పటివరకు మళ్లీ కలవనియ్యలే’ అంటూ తన గోడు వెలిబుచ్చుకున్నాడు’ అంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే సదరు నేతకు సర్దిచెప్దామన్న భావనలో… మరి ఇంచార్జీ మంత్రితో అయినా మాట్లాడకపోయినవా? అని ప్రశ్నించగా… ఆ ఇంచార్జ్ మంత్రి చెప్పిన సమాధానంతో మాజీ టిడిపి నేత అవాక్కైనట్లుగా లోకేష్ చెప్పుకొచ్చారు. ‘అన్నా నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదని సదరు మంత్రి జవాబిచ్చారు’ అంటూ మాజీ టిడిపి నేత తనతో చెప్పుకున్న బాధను వివరించారు లోకేష్. మొత్తానికి కాస్త స్తబ్దుగా తెలంగాణా పొలిటికల్ గడ్డపై నారా లోకేష్ ఓ చిన్నపాటి కదలిక తెచ్చే ప్రయత్నం చేసారు.



