గొడ్డలి పార్టీ అంటూ బాగానే రాగింగ్ చేస్తున్నారు కానీ..

TDP vs YSRCP: Is Jagan Outplaying Chandrababu Naidu?

వైసీపీని ‘గొడ్డలి పార్టీ’ అంటూ టీడీపి బాగానే పాపులర్ చేసింది. దానిని అది ఖండించలేని పరిస్థితి కూడా కల్పించింది. కానీ టీడీపి కంటే వైసీపీ ఎప్పుడూ ముందుంటోందని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ప్రభుత్వానికి సవాలు విసురుతున్న వైసీపీని ఆ క్రమంలోనే టీడీపి నేతలు ఎదుర్కొంటున్నారు తప్ప ఎన్నడూ దాని కంటే ఒక అడుగు ముందుండలేకపోతున్నారు.

ఉదాహరణకు ఢిల్లీ ఆందోళనల స్పూర్తితో వైసీపీ చెలరేగిపోతూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ హడావుడి మొదలుపెట్టిన తర్వాతే టీడీపి అప్రమత్తమై ఎదురుదాడి చేస్తోంది తప్ప దాని వ్యూహం ముందుగా పసిగట్టలేకపోయిందనే చెప్పాలి.

ADVERTISEMENT

అంతకు ముందు అంబటి రాంబాబుతో ‘కాపు రాజకీయాలు’ మొదలుపెట్టిన తర్వాతే, టీడీపి మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

టీడీపి సీనియర్ నేత, ఎమ్మెల్యే బొండా ఉమా ఇటీవల ముద్రగడ సంస్మరణ సభకు వెళ్ళడం, అక్కడ అంబటి రాంబాబుతో ముచ్చట్లు, తర్వాత చేసిన వ్యాఖ్యలు మరో ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బొండా ఉమని వైసీపీ ఆకర్షించగలిగి ఉంటే పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే అది ఎంత తెలివిగా పావులు కదుపుతోందో.. ఇది ఎంత తీవ్రమైన సమస్యగా మారేదో అర్ధమవుతుంది.

కనుక టీడీపి అభివృద్ధి మంత్రం జపిస్తూ ప్రజలు మావైపే ఉన్నారనే భ్రమలో ఉంటే, 2019 ఎన్నికలలో మాదిరిగానే అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.

కేవలం 11 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలస్‌లో నుంచి కాలు బయటపెట్టకుండానే టీడీపిని రాజకీయంగా ఎదుర్కొంటుంటే, టీడీపి అధికారంలో, ప్రజల మధ్యలో ఉంటూ కూడా ఎప్పుడూ వైసీపీకి సంజాయిషీలు ఇచ్చుకుంటూ, ఆత్మరక్షణ రాజకీయాలకే పరిమితం అవుతుండటం విచిత్రంగా అనిపిస్తుంది. అవునో కాదో టీడీపియే ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories