ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కల్తీ అయ్యాయా.?

Tirumala Ghee Controversy Rocks AP Politics

ఆంధ్రప్రదేశ్ లో తిరుమల శ్రీవారి చుట్టూ జరుగుతున్న రాజకీయాలతో ఏపీ రాజకీయాలు పూర్తిగా కల్తీ మయం అవుతున్నాయి. ప్రజా సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి చర్చించాల్సిన విలువైన సభా సమయాన్ని రాజకీయ పార్టీలు ఇలా తిరుమల పవిత్రత మీదకు మళ్లించి కల్తీ చేస్తున్నాయి.

ప్రభుత్వంలో ఉన్న కూటమి ఆరోపణలతో సమస్యను సాగతీస్తుంటే, విపక్షంలో ఉన్న వైసీపీ ఎదురుదాడితో సమస్యను తీవ్రతరం చేస్తుంది. ఇక్కడ కల్తీ జరిగింది తిరుమల శ్రీవారి ప్రసాదంలో నెయ్యి అనేది అందరికి స్పష్టమయింది. అయితే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది.

ADVERTISEMENT

కానీ ఇలా భక్తుల మనోభావాలతో నిత్యం రాజకీయం చేస్తే చేతిలో ఉన్న అధికారం కేవలం ఆరోపణల కోసమేనా అన్న అసహనం సామాన్య ప్రజలలో బలపడుతుంది. అలాగే వైసీపీ కూడా ఎదురుదాడితో తన తప్పు కప్పిపుచ్చుకోవాలని చూస్తూ సమస్యను మరింత జటిలం చేస్తుంది.

దీనివల్ల తప్పులేకుంటే వైసీపీ లో ఈ తడబాటెందుకు.? కల్తీ జరిగినట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే స్వయంగా అంగీకరిస్తుంటే జగన్ ఎందుకు దాన్ని పక్క దారికి మళ్లిస్తున్నారు.? అంటూ సామాన్య భక్తులలో వచ్చే అనేక సందేహాలకు వైసీపీ కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది.

రాజకీయ పార్టీల రాజకీయం….రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లి ఇప్పటికే కొంత కలుషితమైపోయింది, ఇక సొంత రాష్ట్ర రాజధాని పై నీలి ప్రచారాలతో ఇంకాస్త పతనమైపోయింది, ఇప్పుడు తాజాగా ఆ రాజకీయం రంగు మార్చుకుని దేవుని ప్రసాదం పవిత్రత పైనే అనుమానాలు లేవనెత్తే స్థాయికి చేరింది.

చివరికి ఆ దేవదేవుడిని చట్టసభలకు కూడా తీసుకొచ్చి తన ఉనికిని చాటుకోమని ఆయనకే సవాళ్లు విసిరే స్థాయికి ఏపీలో రాజకీయాలు కలుషితం అయ్యాయి. ఎన్నడూ లేని విధంగా కలియుగ ప్రత్యక్ష దేవుడు సైతం కలికాలంలో చట్టసభలలో అడుగు పెట్టారు, ఇప్పుడు తన ప్రసాదం లో కల్తీ అనే అపచారం జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి న్యాయస్థానం ముందు న్యాయం కోసం నిలబడ్డారు.

ఆ దేవదేవునికి న్యాయం చెయ్యాలని ఒకరు, ఆ దేవదేవుని పట్ల అన్యాయం జరగలేదంటూ మరొకరు, ఇలా వారి వారి వాదనల మధ్య ఏపీ రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కల్తీ గా మారిపోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రకే మకిలి పట్టించేస్తున్నాయి. ఈ చర్చలతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనుమరుగైపోతుంది, ఈ చర్చలతో ఏపీలో ఉన్న ప్రజా సమస్యలు పక్కదారి పట్టేస్తున్నాయి.

రైతుల సాగు – తాగు నీటి సమస్యలు, నిరుద్యోగుల ఉపాధి సమస్యలు, మహిళల భద్రతా…ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం – విపక్షం కలిసి చర్చించాల్సిన ఎన్నో విషయాలు ఈ కల్తీ రాజకీయం ముందు కొట్టుకుపోతున్నాయి.

అయితే ఈ కల్తీ లడ్డు వ్యవహారం పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ని ఏర్పాటు చేయగా దాని పై సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు సుబ్రమణ్య స్వామి. ఇక సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చింది.

ఈ కమిటీ కేవలం పరిపాలనా పరమైన లోపాల గుర్తింపు కోసమేనని, దీని ఫలితంగా ఇతర విచారణల నివేదికల పై ఎటువంటి ప్రభావం ఉండదంటూ స్వామి పిటిషన్ ను కొట్టేసింది ధర్మాశానం. దీనితో కూటమి ప్రభుత్వానికి ఊరట లభించినట్లయ్యింది.

ఇక ఇప్పటికైనా తిరుమల శ్రీవారి చుట్టూ సాగుతున్న ఈ అంతులేని సీరియల్ కథలకు ముగింపు పలికి ఆ కల్తీ వ్యవహారాన్ని ఇరు పార్టీలు న్యాయస్థానాలకే అప్పగించి గోవిందా….గోవిందా అంటూ మౌనం పాటిస్తే ఆ ఏడుకొండలవాడి భక్తులకు కనీసం ఆత్మతృప్తయినా మిగులుతుంది సుమీ..!

ADVERTISEMENT
Latest Stories