వీడియో కాల్‌ ద్వారా తండ్రి అంత్యక్రియలు… గ్రేట్!

VC Sajjanar on parents

తల్లితండ్రులు తమ జీవితాన్ని, కష్టార్జితాన్ని పిల్లలకు ధారపోసేందుకు ఏమాత్రం వెనకాడరు. తరతరాల నుంచి ఇలాగే సాగుతోంది. కనుక నేటి తరం కూడా తమ చిన్నారుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రాధమిక పాఠశాల స్థాయిలోనే లక్షలు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు.

ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు తల్లితండ్రులు తమ ఆర్ధికశక్తి మేర పిల్లలను చదివించి ప్రయోజకులుగా చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

తల్లితండ్రులుగా తమ పిల్లల మీద అంత ప్రేమ చూపుతున్నప్పుడు, ఖర్చులకు వెనకాడనప్పుడు, తమ కన్న తల్లితండ్రులను కూడా అంతే ప్రేమ, గౌరవంగా చూసుకోవాలి కదా? ఆ తల్లితండ్రులు కూడా తమ లాగే తమ కోసం వారి జీవితాలను పణంగా పెట్టారు కదా? అంటే ‘కుదరదనేవారు’ మన సమాజంలో కోకొల్లలున్నారు.

“హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త తన జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తెలున్నారు. కానీ తండ్రి చనిపోతే ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేదు. దాంతో ఆయనని అనాధ శవంగా పరిగణించి సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా ఆయన కుమార్తె ఒకరు వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను చూస్తూ, అన్నీ సవ్యంగా జరిపించాలని సిబ్బందికి సూచనలు చేశారు. తండ్రి అంత్యక్రియల ఖర్చుల కోసం ఆమె వారికి రూ. 5,100 ఆన్‌లైన్‌లో పంపించారు,” అంటూ హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్‌గా విసి సజ్జనార్‌ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ షేర్ చేశారు.

“మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు?

కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి? చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్‌లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?

తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.

కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్కృతి మారాలి,” అంటూ విసి సజ్జనార్‌ హితవు పలికారు.

ఆయన చెప్పిన మాటలు అక్షరాల నిజమని అందరూ అంగీకరిస్తారు. అలాగే ఇప్పుడు సమాజంలో వృద్ధులకు, వృదాప్యంలో ఉన్న తల్లితండ్రులకు సముచిత గౌరవం, ప్రేమాభిమానాలు లభించడం లేదనేది కూడా వాస్తవం. పిల్లలందరూ తమ తల్లితండ్రులతో ఇలాగే ఉంటారని కాదు. కానీ ఇలా ఉండేవారి సంఖ్యా నానాటికీ పెరుగుతోందని పెరుగుతున్న వృధాశ్రమాలు చెపుతున్నయిగా!

ADVERTISEMENT
Latest Stories