మెగా బ్రదర్స్ కొత్త సినిమా అంటే అభిమానులకు అదో పండగ. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరిదైనా సరే ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. నెల రోజుల ముందు నుంచే వాళ్లలో ఎగ్జైట్ మెంట్ పీక్స్ కు వెళ్తుంది. నిర్మాతలు ప్రమోషన్లతో అంచనాలు పెంచే పనిలో పడతారు. వాటికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి మోత మ్రోగిపోతుంది.
కానీ విచిత్రంగా కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉన్నా బ్రో పట్ల ఎలాంటి ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు. దానికి మొదటి కారణంగా ఫ్యాన్స్ తమన్ వైపు వేలెత్తి చూపుతున్నారు. రెండు పాటలు నిరాశపరిచాయి. దీని దెబ్బకు గుంటూరు కారంకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడోనని మహేష్ బాబు అభిమానులు టెన్షన్ పడే పరిస్థితి తలెత్తింది. వినోదయ సితం రీమేక్ అన్నప్పటి నుంచే బ్రో మీద పెద్దగా బజ్ లేదు.
ఇక భోళా శంకర్ ది మరో విచిత్రమైన పరిస్థితి. ఎపుడో స్టార్ కెమెరా యాక్షన్ చెప్పడం మానేసిన మెహర్ రమేష్ ని నమ్మి సినిమా ఇచ్చారు. పోనీ ఏమైనా కొత్త కథా అంటే అదీ లేదు. రొట్ట రొటీన్ అజిత్ వేదాళం. సరే ఫ్రెష్ గా ఇస్తాడని నమ్మి మహతి స్వర సాగర్ కి సంగీత బాధ్యతలు ఇస్తే కుర్రాడేమో ఇంటర్వ్యూలలో హుషారుగా ఏదేదో చెప్పాడు తప్ప పాటలు మాత్రం ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాసన కొడుతున్నాయి.
ఆన్ లైన్లో చూసేసిన రీమేక్స్ అనే ప్రభావం బ్రో, భోళా శంకర్ లపై మొదటి నుంచే ఉంది. దానికి తగ్గట్టే ఆడియోలు నిరాశ పరచడం, పబ్లిసిటీ హంగామా పెద్దగా లేకపోవడంతో లైట్ తీసుకునే పరిస్థితి తలెత్తింది. ఆచార్య విషయంలో ఇలాంటి నిర్లక్ష్యమే కనీసం బెనిఫిట్ షోలను ఫుల్ చేయలేదు. ప్రీ రిలీజ్ టైంలో వచ్చిన నెగటివ్ వైబ్రేషన్స్ అలాంటివి. కానీ బ్రో, భోళా శంకర్ విషయంలో అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్లదే.
పవన్ చూస్తేనేమో వారాహి వదిలేసి వచ్చే పరిస్థితి లేదు. మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావొచ్చు. ఇక చిరంజీవి భారం తన భుజాల మీద వేసుకుని లీక్స్ పేరుతో వీడియోలు గట్రా వదులుతున్నా చెప్పుకోదగ్గ ఆసక్తి పెరగడం లేదు. మెగా సోదరులకు ఇలాంటి అనుభవం అరుదు . చాలా ఎక్స్ ట్రాడినరీగా ఉన్నాయని పబ్లిక్ టాకులు, రివ్యూలు వస్తేనే బ్రో, భోళా శంకర్ లు ఏమైనా అద్బుతాలు చేస్తాయి. చూడాలి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.



