ఫిరాయింపులకు “బ్రాండ్ అంబాసిడర్” నేనే అంటున్న జగన్!

YS Jagan comments on jumping ysrcp politicians‘ఫిరాయింపు’ ద్వారా పుట్టిన పార్టీ వైసీపీ. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని ఇతర నాయకులను బయటకు రావాల్సిందిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత జగన్ సొంతం. అప్పటినుండి దాదాపు మూడేళ్ళ పాటు కాంగ్రెస్, టిడిపి నాయకులను చేర్చుకుంటూ ఓ రకంగా ఫిరాయింపుకు ‘బ్రాండ్ అంబాసిడర్’గా వ్యవహరించారు. అలాంటి జగన్ కు ఇపుడు ‘ఫిరాయింపుదారులే’ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ADVERTISEMENT

ఒకప్పుడు ఏదైతే తన బలం అని భావించారో, అది బలం కూడా బలహీనత అన్న విషయం నిరూపించేలా వైసీపీ నుండి నాయకులు వీడుతున్నారు, ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారని వినికిడి. అయితే అప్పుడు తన వైపుకు వచ్చిన వారంతా కేవలం తనపై ఉన్న అభిమానంతో వచ్చారని చెప్పిన జగన్, ఇపుడు తనను వీడుతున్న వారంతా డబ్బు కోసం వెళ్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమేనని, రెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరంతా తన వద్దకే వస్తారని జగన్ మీడియా ముఖంగా ప్రస్తావించారు.

అంటే, మరో రెండేళ్ళ తర్వాత జగన్ పార్టీ ఫిరాయింపులకు తెరలేపుతానని ఇప్పుడే చెబుతున్నారు. అయితే ఆ సమయంలో నిజంగా సదరు నేతలందరూ వెళ్తారా… వెళ్ళరా… అన్న విషయం పక్కన పెడితే, ఇపుడు ఏ అంశంలో అయితే అధికార పక్షంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారో, రెండేళ్ళ తర్వాత నేను కూడా అదే పని చేస్తానని జగన్ చెప్పడం దేనికి సంకేతం? పార్టీ ఫిరాయింపులను తానూ చేస్తాను… అంటూ బహిరంగంగా చెప్తూ కూడా వర్తమాన రాజకీయాలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత జగన్ కు ఉందా?

ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్ధం కాక తల పట్టుకోవడం ఆ పార్టీ నేతల వంతవుతోందని అంతర్గతంగా రాజకీయ వర్గాలలో వినపడుతున్న మాటలు. అధికార పక్షాన్ని విమర్శించాలనే అత్యుత్సాహంలో ‘తన గొయ్యి తానే త్రవ్వుకుంటున్నారన్న’ విషయాన్ని జగన్ గమనించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆవేశంతో కూడిన వ్యాఖ్యలు చివరికి అర్ధరహితంగా ముగిసి, తన మెడకే చుట్టుకుంటున్నాయని జగన్ గ్రహించిన నాడే ఈ ప్రేలాపనలకు ‘శుభం కార్డు’ పడుతుందన్న భావనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories