జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో అభియోగ పత్రం దాఖలు చేసింది. జగన్ కంపెనీల్లో అరబిందో, హెటిరో సంస్థలు 29.50 కోట్లు పెట్టుబడి పెట్టాయని, అందుకు గాను వైఎస్ ప్రభుత్వం 75 ఎకరాల భూమిని వీరికి కేటాయించినట్లు ఈడీ పేర్కొంది.
ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రా, అరబిందో చైర్మన్ పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ మాజీ ఎండీ శరత్ చంద్రారెడ్డి, నిత్యానందరెడ్డి సోదరుడు కె.ప్రసాద్ రెడ్డి, నిత్యానందరెడ్డి భార్య రాజేశ్వరి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్, హెల్త్ కేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్, ట్రైడెంట్ లైఫ్న సైన్సెస్, బీపీ ఆచార్య, విశ్రాంత జీఎం వైవీఎల్ ప్రసాద్, అరబిందో మాజీ సీఎస్ చంద్రమోహన్ లు మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ నిందితులుగా పేర్కొంది.
సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా ఈ విచారణ జరిపినట్లు తెలిపిన ఈడీ తాజా పరిణామాలతో జగన్ వర్గంలో కలకలం మొదలైంది. ఒక వైపు తానూ నిర్దోషి అంటూ జగన్ చెప్పుకుంటున్నా, మరో వైపు ఈడీ ఆస్తుల ఎటాచ్ మెంట్ కొనసాగింది. మరి ఇపుడేమో మరో చార్జ్ షీట్ దాఖలైంది. దీంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కలుగుతోంది.





