ఒక రాజకీయ పార్టీ ఏ ఏ విధానాలు అనుసరించకూడదో సరిగ్గా అవే విధానాలతో వైసీపీ అధినేత జగన్ తన పార్టీని ప్రజల ముందుకు తీసుకెళ్ళారు. ఒక రాజకీయ పార్టీకి ‘మతం’ రంగు పులుముకుంటే తలెత్తే వివాదాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే అది తెలిసి కూడా జగన్ తన పార్టీకి ఒక ‘మతం’ రంగు అంటుకుంటోదన్న భయాన్ని వీడి అలాగే ముందుకెళ్ళారు. బహుశా ఆ మత ప్రభావమే తనను సిఎం కుర్చీలో నిలబెడుతుందని జగన్ విశ్వసించారో ఏమో గానీ వైసీపీ అనగానే ‘క్రిస్టియానిటీ’ గుర్తుకు వచ్చే విధంగా ఒక బలమైన ముద్ర వేయడంలో జగన్ నూటికి నూరు పాళ్ళు విజయవంతమయ్యారు.
అయితే ఇటీవల కాలంలో పార్టీ అంతర్గత సమావేశాలలో పలువురు నాయకులు ఈ విషయాన్ని తెగేసి చెప్పడంతో జగన్ తన వైఖరిలో కాస్త మార్పు తెచ్చుకున్నట్లుగా కనపడుతోంది. ఒకప్పుడు, తానూ వెళుతున్న దోవలో హిందువుల దేవాలయాలు కనపడినా పట్టించుకోని జగన్, ఇపుడు మాత్రం ప్లాన్ చేసుకుని మరీ హిందువుల గుళ్ళకు, మఠాలకు హాజరు అవుతున్నారంటే… తనపై, పార్టీపై ఏర్పడిన మచ్చను తుడిచివేయడానికే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల జరిపిన విశాఖ పర్యటనలో శారదా పీఠం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హిందువుల సంప్రదాయ దుస్తుల్లో హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ జగన్ వైఖరిలో మార్పు వచ్చిందని పలువురు అంటుంటే, సిఎం కావడానికి జగన్ ఎటువంటి కార్యక్రమలైనా చేస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సిఎం కుర్చీ కోసం జగన్ చేస్తున్న రాజకీయ చర్యలను పరిశీలిస్తున్న వారు మాత్రం… దేవుళ్ళను కూడా రాజకీయంలో చేర్చిన ఘనత జగన్ దేనని విమర్శలు గుప్పిస్తున్నారు.



