వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ పాత్ర ఉంది. వైఎస్ ఉండగా ఎప్పుడు బయటకు రాని వాళ్ళు ఆ తరువాత జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడానికి చాలా కష్టపడ్డారు. అయితే జగన్ తో వారి ప్రయాణం చూసిన వారెవరికైనా ఒక విషయం అర్ధం అవుతుంది. జగన్ కు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు బాగా అవసరమైనప్పుడు మాత్రమే వారిని తెర మీదకు తెస్తారు. దానివల్ల కొంత విమర్శలు కూడా ఎదురుకున్నారు జగన్.
ఇది ఇలా ఉండగా వైఎస్ విజయమ్మ ఉన్నఫళంగా సాక్షి టీవీలో ప్రత్యేక్షం అయ్యారు. నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆమె స్పెషల్ ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఎప్పటిలానే జగన్ బాబు మా బంగారు బాబు అంటూ మమకారం చూపించారు. అలాగే చంద్రబాబు మీద విమర్శలూ చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ జగన్ ను కష్టపెట్టిందని, చంద్రబాబు వారితో చేతులు కలిపారని అప్పటి విషయాల నుండి ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో చేస్తున్న విమర్శల వరకూ రకరకాల విషయాలపై విమర్శలు చేశారు.
తెలుగుదేశం అభిమానులు మాత్రం 100 రోజులు కూడా పూర్తి కాకముందే జగన్ చాలా ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారని, ఎంతో కొంత నష్టనివారణ కోసమే తల్లి విజయమ్మను తెరమీదకు తెచ్చారని ఆక్షేపిస్తున్నారు. మరోవైపు నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.



