‘జగన్’ను వణికిస్తున్న ‘డెడ్ లైన్!’

YS Jagan in frustationవైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా, తెలుగుదేశం నేతలు చేసిన ‘డెడ్ లైన్’ తేదీ సమీపిస్తోంది. దీంతో ఇంకెంతమంది పార్టీని వీడుతున్నారో అన్న వణుకు పార్టీ అధినేతకు కలగడం సహజమే మరి. మార్చి 5వ తేదీ లోపు ఎంతమంది టిడిపిలో చేరతారో చూసుకోండి అంటూ అధికార పార్టీ మంత్రులు అచ్చేన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారు చేసిన వ్యాఖ్యల పర్యవసానాలు జగన్ ఇప్పటికే చవిచూస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా నుండి మరొక ఎమ్మెల్యే చంద్రబాబు చెంత చేరడంతో, వైసీపీని వీడిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.

ADVERTISEMENT

ఎప్పటికప్పుడు మరొక ఎమ్మెల్యే తమ పార్టీని వీడరంటూ వైసీపీ నేతలు చేస్తున్న మాటలు అర్ధరహితమని తేలిపోయింది. చెప్పిన ప్రతిసారి ఒకరిద్దరు వలస బాట పడుతుండడం గమనిస్తూనే ఉన్నాం. అయితే తెలుగుదేశం నేతలు గతంలో చెప్పిన వ్యాఖ్యలను బట్టి దాదాపుగా సగం మందికి పైగా వైసీపీని వీడతారని అన్నారు. ‘డెడ్ లైన్’కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఒక్కసారిగా అంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారా… అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మానసికంగా జగన్ పార్టీ ఇతర నేతలు కూడా ప్రత్యామ్నాయాల కోసం పరుగులెత్తడం ఖాయమనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

దీంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అని విశ్లేషకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలను పరిశీలిస్తే… ఒక మైండ్ గేమ్ మాత్రం స్పష్టమవుతుంది. మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న పేర్లపై దృష్టి కేంద్రీకరించిన జగన్, వారితో మాత్రం ప్రెస్ మీట్ పెట్టించి పార్టీ మార్పును ఖండిస్తున్నారు. అయితే, మరోవైపు అసలు మీడియా వర్గాలలో లేని పేర్లు సైలెంట్ గా ‘సైకిల్’ ఎక్కేస్తుండడం గమనించదగ్గ విషయం. అంటే పార్టీ మారుతున్న వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వర్గాలతో టచ్ లో ఉన్నారని, మీడియా వర్గాలకు కొన్ని పేర్లు వెల్లడిస్తూ జగన్ ను పక్క దారి పట్టిస్తూ, తమ పని చక్కపెట్టుకుంటున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories