ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్డుకి నేడు సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయబోతున్నారు.
ఇది నేటి నుంచే అందుబాటులోకి వస్తోంది కనుక ఇకపై విజయవాడ-మంగళగిరి-అమరావతి మద్య వాహనాల రాకపోకలకు మరింత వెసులుబాటు లభిస్తుంది. ముఖ్యంగా ఇది ఎన్-1 నుంచి ఎన్-17 వరకు మొత్తం 17, ఇవి కాక మరో 17 ప్రధాన రహదారులతో సీడ్ యాక్సిస్ రోడ్ అనుసంధానం చేయడం వలన చుట్టుపక్కల జిల్లాలు, ప్రాంతాల నుంచి రాకపోకలు మరింత సులభతరం అవుతాయి.
రూ. 1,519 కోట్లు వ్యయంతో 21.77 కిమీ పొడవుతో మూడు దశల్లో నిర్మిస్తున్న సీడ్ యాక్సిస్ రోడ్ (ఈ-3)లో మొదటి రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ పనులు వెంటనే మొదలవుతాయి.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్ దొండపాడు వద్ద మొదలై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆస్పత్రి వద్ద ఎన్హెచ్-16తో అనుసంధానం అవుతుంది. కనుక ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా అమరావతి చేరుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ముఖ్యంగా అమరావతిలో అన్ని ప్రధాన కార్యాలయాలను కలుపుతూ నిర్మిస్తున్నందున అమరావతికి రాకపోకలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
కేవలం 21.77 కిమీల సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి రూ.1,519 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారనే సందేహం కలుగవచ్చు. దీనిని 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్లతో నిర్మిస్తున్నారు.
దీనిలో ఇరువైపులా బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లు, సైకిల్ ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్, గ్యాస్, ఇంటర్నెట్ కేబిల్స్ కూడా అండర్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్కి ఇరువైపులా పచ్చటి చెట్లు కూడా ఉండేలా ప్లాన్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ దేశంలో నంబర్:1గా నిలువబోతోంది.




