సాయంత్రం ఉత్తర్వులు.. 24 గంటలలో రోడ్ నిర్మాణం!

Amaravati Seed Access Road Completed in Record Time

అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో సిఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. దీని కోసం వివిధ గ్రామాల రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు.

కానీ వైసీపీ ప్రభావం ఉన్న పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన 8 మంది రైతులు తమకు చెందిన సుమారు 65 సెంట్ల భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించి దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది.

ADVERTISEMENT

ఊహించినట్లే వారు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేవలం 65 సెంట్ల భూమి కారణంగా మొత్తం ప్రాజెక్టుకి అవరోధం ఏర్పడుతోందనే ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ వారి పిటిషన్స్ కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదేమీ పెద్ద విచిత్రం కాదు.

కానీ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే గంట వ్యవధిలోనే ఎన్‌సిసి సంస్థ డజన్ల కొద్దీ జేసీబీలతో ఆ ప్రాంతాన్ని చదును చేయడం మొదలుపెట్టడం, అది పూర్తికాగానే రోడ్డు నిర్మాణం మొదలుపెట్టడమే విశేషం.

ఇంతకాలం 65 సెంట్ల భూమిపై వివాదం కొనసాగుతున్నందున, వాహనాల రాకపోకల కోసం వాటి పక్క నుంచి రోడ్డు నిర్మించాల్సి వచ్చింది. కానీ 24 గంటలలోనే ఆరు వరుసలతో రోడ్డు నిర్మించి దానిని సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానం చేయడం విశేషమే కదా?

అమరావతి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకునేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?

ADVERTISEMENT
Latest Stories