ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును పెద్ద మోసగాడిగా చిత్రీకరిస్తూ ఇటీవల కాకినాడలో జరిగిన యువభేరీలో జగన్ ప్రసంగించిన విధానం తెలిసిందే. అయితే అందరి కంటే పెద్ద మోసగాడు జగన్ మాత్రమేనని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం వివేకానందరెడ్డి వైసీపీ అధినేతపై తీవ్రంగా మండిపడ్డారు.
‘మోసగాడు’ అంటే ‘420’ అని, 37 కేసులతో జగన్ అతి పెద్ద ‘మోసగాడి’గా ఉన్నాడని, “జగన్ అంటే 420 – 420 అంటే జగన్” అని ఆనం తీవ్రపదజాలంతో స్పందించారు. ‘అవినీతి’ సామ్రాజ్యానికి జగన్ ‘సామ్రాట్,’ అవినీతి కేసులతో కోర్టులకు హాజరవుతూ చంద్రబాబును మోసగాడు అనడం హాస్యాస్పదంగా ఉందని, అమరావతి నిర్మాణం చూసి ఒర్వలేక జగన్ ఆరోపణలు చేస్తున్నారు, ఓదార్పు యాత్రలతో ప్రజలను ఏడిపించే శాడిస్ట్ జగన్” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు ఆనం.
జగన్ పై ఫైర్ అయిన ఆనం వివేక మాటలు వైకాపా వర్గాలను బాగానే తాకాయి. ముఖ్యంగా ‘ఓదార్పు యాత్ర’లో కొత్త కోణాన్ని ఆనం ఆవిష్కరించారు. పండుగల సమయంలో కూడా జగన్ ‘ఓదార్పు యాత్రలు’ నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆనం చెప్పినట్లు పండగల సమయంలో కూడా ‘ఓదార్పు’ పేరుతో ప్రజలను ఏడిపించిన ఘనత జగన్ దేనని, ఆనం లాజిక్ సరైనదేనంటూ నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు కోకొల్లలు.





