జూన్ నాటికల్లా ఏపీ పాలనను అమరావతి కేంద్రంగా సాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ చేస్తూ, ఉద్యోగులు చెప్పిన ప్రతి అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మితం అవుతోన్న తాత్కాలిక సచివాలయం జూన్ నాటికి సిద్ధం అయ్యేలా ప్లాన్ చేయడంతో, ఒక్కసారి పూర్తి కాగానే, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించే ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగానే ఉద్యోగులు ఆశించిన 30 శాతం అదనపు హెచ్ఆర్ఏతో పాటు వారానికి 5 రోజుల పని దినాలకు చంద్రబాబు ఓకే చెప్పారు. అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సిన వాటి కంటే ఎక్కువ చేస్తున్నా, కొందరు ఉద్యోగులు మాత్రం అమరావతి రావడానికి సిద్ధంగా లేకపోవడంతో, స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) వైపుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా ఆరుగురి ఉద్యోగులకు ప్రభుత్వం వీఆర్ఎస్ ను మంజూరు చేయగా, తాజాగా పదుల సంఖ్యలో వినతి పత్రాలు ప్రభుత్వానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా పదవీ విరమణకు తుది దశలో ఉన్న వారంతా వీఆర్ఎస్ వైపుకు మొగ్గు చూపుతున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. కెరీర్ చివరి దశలో వసతులు లేని చోట ఇబ్బందులు పడే కన్నా, రిటైర్మెంట్ తీసుకోవడమే మెరుగు అన్న ఉద్యోగుల నిర్ణయానికి బహుశా చంద్రబాబు సంతోషపడవచ్చు. స్వలాభం చూసుకునే ఉద్యోగులు కష్టకాలంలో ఉన్న ఏపీకి శ్రమించరు గనుక, ఇలాంటి ఉద్యోగులు రాకపోవడమే మెరుగన్న భావన ప్రజల్లో కూడా ఉంది. 65 ఏళ్ళ వయసులో రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు చంద్రబాబు అంతలా కష్టపడుతున్నా, మరో పక్క ఉద్యోగుల ప్రవర్తనా శైలితో ప్రజలు మండిపడుతున్నారు.





