వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ సర్వీసులు ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలకు విస్తరించింది. అయితే వాటిలో సకల అత్యాధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ, అన్ని గంటలు కూర్చొని ప్రయాణించాల్సి రావడం ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వేశాఖ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్ళని ప్రవేశపెడుతోంది.
త్వరలో ఆంధ్రప్రదేశ్కు కూడా వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఆంధ్రా ఐటి రాజధాని విశాఖపట్నం నుంచి దేశ ఐటి రాజధాని బెంగళూరు మద్య దీనిని నడిపించబోతున్నారు.
వీటిని నడిపించేందుకు సాధ్యాసాధ్యాలు, మార్గంలో రైళ్ళ క్రాసిన్గ్స్, వాటిని అధిగమించేందుకు తగిన టైమింగ్స్, సానుకూలతలు, సమస్యల గురించి వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ సీపీటీఎం షిఫాలీ కుమార్ జూలై 31న సర్క్యులర్ జారీ చేశారు.
దక్షిణ పశ్చిమ రైల్వే జోన్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డీఆర్ఎంలు దీనిపై నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. వాటిని రైల్వేబోర్డు ఆమోదిస్తే విశాఖ-బెంగళూరు మద్య వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తుంది.
సర్క్యులర్ ప్రకారం వారానికి ఆరు రోజులు ప్రతీరోజూ (సోమవారం, మంగళవారం తప్ప) రాత్రి పూట నడిపించాలని ప్రతిపాదించారు.
విశాఖ నుంచి ప్రతీ రోజూ (సోమవారం తప్ప) రాత్రి 8.15గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా మర్నాడు ఉదయం 10.00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
ఇదే విధంగా బెంగళూరు నుంచి ప్రతీరోజూ (మంగళవారం తప్ప) రాత్రి 8.00 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 10.00 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
దీని కోసం రెండు వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్ళని కేటాయించబోతున్నట్లు సర్క్యులర్లో తెలిపారు.
బెంగళూరు ఐటి కంపెనీలలో లక్షల మంది ఆంధ్రావాళ్ళు పనిచేస్తున్నారు. కనుక ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే వారందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బహుశః దసరా నుంచి ఈ రైళ్ళు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Vande Bharat Sleeper





