ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు మండలి సమావేశాలు మొదలవుతాయి. ఈసారి కేవలం నాలుగైదు రోజులే శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శాసనసభ సమావేశాలంటే కొన్ని పాత ఆనవాయితీలతో పాటు ఓ కొత్త ఆనవాయితీ కూడా ఏర్పడింది. పాత ఆనవాయితీ ప్రకారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు.
కొత్త ఆనవాయితీ ప్రకారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదనే వాదనలు వినిపిస్తుంటాయి. పాత ఆనవాయితీలు ఎప్పుడూ చప్పగానే ఉంటాయి. కానీ ఈ కొత్త ఆనవాయితీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది.
ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతోందనే పల్లవి ఆ పాటలో తప్పక వినిపిస్తుంది. దానికి చరణంగా గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పాలన, సమావేశాలు సాగేవో వినిపిస్తుంటుంది.
అయితే అరుణాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే ఉంటాయని తెలిసి ఉన్నప్పటికీ, చైనా, పాకిస్తాన్లు ఆపకుండా అదే పాత పాట పాడుతున్నట్లుగా, ప్రధాన ప్రతిపక్షనేత హోదా లభించదని తెలిసి ఉన్నప్పటికీ వైసీపీ ప్రతీసారి ఇదే పాట పాడుతూనే ఉంటుంది.
కానీ ఆరు నెలల నిబంధన పాటించకపోతే శాసనసభ్యత్వం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది కనుక అయిష్టంగానైనా 11 మంది టీమ్తో కెప్టెన్ జగన్ హాజరు కోసం శాసనసభకు రాక తప్పదు. ప్రధాన ప్రతిపక్షనేత హోదా కోరుతున్న అయన ఇలా గెస్ట్ రోల్ ప్లే చేసి వెళ్ళిపోవడం ఏమిటో అర్థం కాదు. కానీ దానికీ అభిమానులు చాలా మందే ఉన్నారు ఇంతా బయటా!




