ఏపీ సిఎం ఎన్నికలకు ‘సిద్దం’ అంటూ వివిద జిల్లాలలో నిర్వహిస్తున్న సభలకు జనాలను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన వందలకొద్దీ బస్సులను అప్పనంగా తెచ్చి వాడేసుకుంటున్నారు. అవి సరిపోన్నట్లు ఆయా ప్రాంతాలలో ప్రైవేట్ స్కూళ్ళకు బలవంతంగా సెలవు ప్రకటింపజేసి ఆ స్కూలు బస్సులను కూడా వైసీపి నేతలు వాడేసుకుంటున్నారు.
ఒక్క సిద్దం సభలకే కాదు… ప్రతీ నెల రెండు సార్లు బటన్ నొక్కుడు సభలకు, ‘ఆడుదాం ఆంద్రా’ఇంకా ఇతర కార్యక్రమాలకు కూడా వైసీపి నేతలు ఏపీఎస్ ఆర్టీసీ, స్కూల్ బస్సులను యధేచ్చగా వాడేసుకుంటారు.
కానీ నేడు తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేనలు కలిసి నిర్వహిస్తున్న ‘తెలుగు జన విజయ కేతనం’ సభకు 100 బస్సులు కావాలని టిడిపి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మరో 50 బస్సులు కావాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆర్టీసీకి దరఖాస్తు చేసుకోగా లేవని చెప్పి పంపించేశారు. వీరిద్దరే కాక చుట్టుపక్కల జిల్లాలలో పలువురు టిడిపి నేతలు బస్సుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికీ ఇదే సమాధానం లభించింది.
జగన్మోహన్ రెడ్డి సభలకు వైసీపి నేతలు తీసుకువెళ్లే ఆర్టీసీ బస్సులకి ఆ పార్టీ డబ్బు చెల్లిస్తుందనే నమ్మకం లేదు. కానీ టిడిపి తీసుకునే ప్రతీ బస్సుకి తప్పనిసరిగా అద్దె చెల్లిస్తుంది. చెల్లించకపోతే కేసులు నమోదు చేసుకునే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది.
కనుక తాడేపల్లిగూడెం సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా వైసీపి అడ్డుకోవడం వలన ఏపీఎస్ ఆర్టీసీ ఆ మేరకు భారీగా ఆదాయం కోల్పోయింది. ఒకవేళ ఇచ్చి ఉంటే వైసీపి ప్రభుత్వానికి హుందాగా ఉండేది. ఏపీఎస్ ఆర్టీసీ భారీగా ఆదాయం సమకూరేది కదా?అంటే వైసీపి రాజకీయ కక్షలకి ఏపీఎస్ ఆర్టీసీ కూడా నష్టపోతోందన్న మాట!
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్, టిడిపి, జనసేన నేతల సొంత వాహనాలలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు తాడేపల్లిగూడెంకు చేరుకొంటున్నారు.




