అగస్టా కుంభకోణం… తిలా పాపం తలా పిడికెడు..!

augusta-westland-scam-detailsవీవీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు తేల్చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో చేతులు మారిన లంచాల విలువను కూడా ఆ దేశ కోర్టు నిగ్గు తేల్చింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ వ్వవహారంలో అధికారులతో పాటు రాజకీయ నేతలు వాటాలేసుకుని మరీ బొక్కేశారని ఖరారైంది.

ADVERTISEMENT

అగస్టా వెస్ట్ ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్ల కొనుగోలుకు భారత ప్రభుత్వం మొత్తం 3,600 కోట్లు వెచ్చింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా 30 మిలియన్ యూరోలను లంచాల రూపంలో ఖర్చు చేసింది. ఈ మొత్తం మన కరెన్సీలో లెక్కిస్తే… 227 కోట్లుగా లెక్కలు బయట పడ్డాయి. ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు 115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది.

తీర్పు కాపీలను పరిశీలిస్తే… ఎవరికెంత ముడుపులు చెల్లించామన్న విషయాన్ని అగస్టా కంపెనీ ఓ చిత్తు కాగితంపై ‘కోడ్ నేమ్’లతో రాసుకుంది. దీనిని సదరు కంపెనీ ముడుపులుగా కాకుండా ‘బడ్జెట్ ఖర్చులు’గా పేర్కొనడం విశేషం. ముడుపుల విషయానికొస్తే… ‘ఎఫ్ఎంఏ’గా పేర్కొన్న వ్యక్తికి 15 నుంచి 16 మిలియన్ల యూరోలు, ‘ఏపీ’కి 3 మిలియన్ యూరోలు, జేఎస్ ఎయిర్ కు 8.4 మిలియన్ యూరోలు, డీసీహెచ్ కు 1.5 మిలియన్ యూరోలు ముట్టజెప్పింది.

‘ఎఫ్ఎంఏ’గా పేర్కొన్న వ్యక్తి మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగి కుటుంబంగా నిర్ధారణ అయ్యింది. ‘ఏపీ’గా పేర్కొన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అని తీర్పు కాపీలోని 204వ పేజీలో ఇటలీ కోర్టు తేల్చేసింది. ఈ తీర్పు భారత్ లో పెను రాజకీయ దుమారాన్ని రేపింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తావన సదరు కోర్టు తీర్పు కాపీలో చోటుచేసుకోవడంతో తాజాగా సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావనకు వచ్చిన భారతీయులపై కేసులు నమోదు చేయాలని సదరు పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, సీబీఐలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మరింత విషమ పరిస్థితి ఎదురయ్యేలా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories