మిత్రులైనా శత్రువులైనా కట్టడి తప్పదు… పక్కలో బల్లేలు తప్పవు!

BJP’s Strategy Behind Protecting Jagan Raises Questions

ఏపీలో టీడీపి, జనసేన, బిజేపి మూడు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం నడిపిస్తున్నాయి. అలాగే ఎన్డీయేలో భాగస్వాములుగా టీడీపి, జనసేనలు కేంద్రానికి మద్దతుగా నిలబడుతున్నాయి.

మూడూ మిత్రపక్షాలే అయినప్పుడు వాటిలో ఒకదాని రాజకీయ శత్రువుని మిగిలిన రెండు పార్టీలు కూడా శత్రువుగా పరిగణించాలి కదా? జనసేన అలాగే పరిగణిస్తూ మిత్రధర్మం పాటిస్తోంది. కానీ బిజేపి అధిష్టానం మాత్రం నేటికీ గోడ మీద పిల్లిలాగే వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఎంతగా తోడ్పడుతున్నా, జగన్‌ పట్ల బిజేపి అధిష్టానం మనసులో ఇంకా చోటు ఉంది. అందుకే ఆయన ఎంతగా రెచ్చిపోతున్నా పల్లెత్తు మాటనడం లేదు!

అక్రమాస్తుల కేసులు, వివేక హత్య కేసు ఏళ్ళ తరబడి సాగుతున్నా పట్టించుకోవడం లేదు. “న్యాయస్థానం పరిధిలోని అంశాలలో కేంద్రం తలదూర్చదు,” అని గొప్పగా చెప్పుకున్నా అది వాస్తవం కాదని అందరికీ తెలుసు.

తాజాగా మద్యం కుంభకోణం కేసులో దాదాపు రూ.3,000 కోట్లు పైనే అవినీతి జరిగిందని సిట్ ఆరోపిస్తోంది. మూడు వందల కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా పావులు కదిపిందో అందరూ చూశారు. కానీ ఏపీలో రూ.3,000 కోట్లు కేసుపై కేంద్రం (ఈడీ, సిబీఐ) పట్టించుకోవడం లేదు!

ఎందువల్ల? అంటే టీడీపికి దాని అధినేత చంద్రబాబు నాయుడుని కట్టడి చేసి ఉంచడానికి పక్కలో బల్లెంలా జగన్‌ వంటి ఉంచడం అవసరమే అని బిజేపి అధిష్టానం భావిస్తున్నట్లు అనుమానించాల్సి వస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఆర్ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ని ఇదేవిధంగా పక్కలో బల్లెంలా అమర్చినట్లు చెప్పవచ్చు.

ఫోన్ ట్యాపింగ్‌, కాళేశ్వరం కేసులలో ఆయనని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుపడుతూ కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌, తమిళనాడులో అన్నాడీఎంకే… ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో బిజేపికి పెద్దగా పట్టులేని రాష్ట్రాలలో కూడా రాజకీయాలను నియంత్రించగలుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories