గడువు పెట్టుకొని పనిచేయాలంటే చాలా దమ్ముండాలి!

Chandrababu announces Amaravati deadline

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు నాయుడు 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రకటించారు.

దశాబ్దాలుగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టును మరో ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రధాని సమక్షంలో ప్రకటించడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఈ రెండు ప్రాజెక్టులకు స్పష్టమైన గడువులు పెట్టుకొని పనులు ముందుకు తీసుకెళ్తున్నందువల్లే చంద్రబాబు అంత ధైర్యంగా ఈ ప్రకటన చేయగలిగారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

అమరావతి పనులు కూడా ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ప్రారంభంలోనే మూడేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులను పునఃప్రారంభించారు. ఇప్పుడు నిర్మాణాల వేగం చూస్తుంటే 2028 నాటికి తొలి దశ పూర్తవుతుందనే విశ్వాసం కలుగుతోంది.

అయితే గతంలో నిర్మించిన శాసనసభ, సచివాలయం, హైకోర్టు భవనాలను “తాత్కాలిక భవనాలు”గా పేర్కొనడంపై ఎంతటి రాజకీయ దుమారం రేగిందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరోసారి “అమరావతి తొలి దశ” అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా వైసీపీకి మరో విమర్శాస్త్రాన్ని అందించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అమరావతి మరో వందేళ్లైనా పూర్తి కాదని వైసీపీ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది.

కనుక 2028 నాటికి అమరావతిలో ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, ప్రధాన మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగానే రాజధానిని జాతికి అంకితం చేయిస్తామని ప్రకటించి ఉంటే సందేశం మరింత బలంగా ఉండేది.

అయితే సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఒక్క ప్రకటనతో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ లభించింది. అదే సమయంలో అమరావతి ఎప్పటికీ పూర్తి కాదని ప్రచారం చేస్తూ, మావిగన్‌ పేరుతో ఎన్నికలకు వెళ్తామని చెపుతున్న వైసీపీకి కూడా సవాలు విసిరినట్లయింది.

ADVERTISEMENT
Latest Stories