గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్ళీ తెలుగుదేశంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ కేంద్రంగా జరిగిన ఉదంతంలో ఈ వార్తలకు ప్రాధాన్యత దక్కిన నేపధ్యంలో తాజాగా దీనికి సిఎం చంద్రబాబు బ్రేకులు వేసారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణలతో సత్సంబంధాలు ఉన్న కొడాలి నాని పార్టీలో చేర్చుకుంటే కొత్త తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నానికి చంద్రబాబు ‘రెడ్ సిగ్నల్’ వేసినట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న క్రమంలో కొడాలి నాని కూడా ఈ జాబితాలో చేరాలని చేసిన ప్రయత్నాలు చివరకు బెడిసి కొట్టాయని తేలింది. ఒకప్పుడు చంద్రబాబును ఏకవచనంతో సంభోదిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మరియు నారా లోకేష్ తో అంతగా సఖ్యత లేకపోవడం కొడాలి ‘ఎంట్రీ’కి ‘ది ఎండ్’ కార్డు పడిపోయిందని టాక్. టిడిపి వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నియోజక వర్గం కావడంతో కొడాలి ఖచ్చితంగా టిడిపిలోకి వస్తారని వార్తలు వచ్చిన సంగతి విదితమే.





