శనివారం విజయవాడలో టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీల అభ్యర్ధులకు చంద్రబాబు నాయుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ ముగ్గురూ ఎన్నికలలో నామినేషన్స్ ఫారాలు మొదలు ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతీ దశలో అభ్యర్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రత్యర్ధులను ఎదుర్కోవలసిన తీరుని వివరించారు.
అలాగే ఎన్నికల కోడ్, నియమ నిబంధనలు వగైరా అభ్యర్ధులకు వివరించి ప్రతీ ఒక్కరూ ఈ ఎన్నికలలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఇది వరకులా రాష్ట్రంలో సంప్రదాయ రాజకీయాలు సాగుతున్నట్లయితే నేడు ఇంత ఆలోచించవలసిన అవసరమే ఉండేది కాదు. నామినేషన్స్ వేసి పోటీ చేస్తే సరిపోయేది. కానీ వైసీపి పాలనలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థలని అన్నిటినీ ఖూనీ చేసి దౌర్జన్యపూరితంగా ఎన్నికలలో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తోంది కనుకనే ఈ ఎన్నికలు చాలా క్లిష్టంగా మారాయి. అందుకే మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని వైసీపిని ఎదుర్కోవలసి వస్తోంది,” అని అన్నారు.
“ఈ పొత్తుల కారణంగా పార్టీలో పలువురుకి టికెట్లు ఇవ్వలేకపోయాము. వారిలో చాలా మంది సీనియర్లు కూడా ఉన్నారు. ఈ ఎన్నికలలో గెలవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. కనుక 160 సీట్లు గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాట్లు చేసుకొని అభ్యర్ధులను నిర్ణయించుకోక తప్పలేదు. అయితే ఈ పొత్తుల కోసం త్యాగాలు చేసినవారు ఎవరినీ మేము మరిచిపోము. ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.
“పొత్తులో భాగంగా మిత్ర పక్షాలకు దక్కిన స్థానాలలో పోటీ చేసే అభ్యర్ధులకు మన పార్టీ, వాళ్ళ పార్టీ అని చూడకుండా మిగిలిన రెండు పార్టీలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, అండగా నిలబడి గెలిపించుకోవాలని,” చంద్రబాబు నాయుడు మూడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
“ఈసారి ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఊదేశ్యంతో పవన్ కళ్యాణ్ చాలా త్యాగాలు చేశారని, ఆయన త్యాగాలు వృధా కావని, వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మూడు పార్టీలపైనా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పిన్నట్లు ఒకప్పటి సాంప్రదాయ రాజకీయాలు ఇప్పుడు లేవు. తమ పార్టీని ఎలా గెలిపించుకోవాలనే దాని కంటే, ప్రత్యర్ధి పార్టీలను, వాటి నేతలను ఏవిదంగా దెబ్బ తీసి గెలవాలనే కొత్త సాంప్రదాయాన్ని వైసీపి ప్రారంభించింది.
ఉదాహరణకు టిడిపి అభ్యర్ధులపై భౌతిక దాడులు, సొంత మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటం, టిడిపి, జనసేన, బీజేపీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు, టిడిపి, జనసేన ముఖ్యనేతలు పోటీ చేయబోతున్న కుప్పం, పిఠాపురం, టెక్కలి వంటి కొన్ని నియోజకవర్గాలలో రూ.100-150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దపడటం వంటివి చెప్పుకోవచ్చు.
కనుక చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఈ ఎన్నికలలో నామినేషన్స్ దాఖలు మొదలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతీ దశలో టిడిపి, జనసేన, బీజేపీ అభ్యర్ధులు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఓట్ల బదలాయింపు గురించి కూడా చంద్రబాబు నాయుడు చేసిన సూచనని కూడా మూడు పార్టీల నేతలు ఖచ్చితంగా పాటించినప్పుడే కూటమి విజయం సాధిస్తుంది. కానీ పొత్తులు, అభ్యర్ధులు నచ్చక సహాయ నిరాకరణ చేసుకుంటే చివరికి నష్టపోయేది మూడు పార్టీలలో నేతలు, కార్యకర్తలే.
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికల నాటికి మూడు పార్టీలను కూకటివేళ్ళతో పెకళించి దుంప నాశనం చేసేస్తారని గుర్తుంచుకొని టికెట్స్ రాకపోయినా ప్రతీ ఒక్కరూ విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడవలసిందే.




