ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్విట్జర్లాండులోని దావోస్ నగరం పర్యటనకు బయలుదేరారు. కీలక శాఖల అధికారులతో కలిసి పర్యటించిన చంద్రబాబు ఈ నెల 23 వ తేదీ వరకు స్విస్ లోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా “వరల్డ్ ఎకనమిక్ ఫోరం” సదస్సు వేదికపై ‘బ్రాండ్ ఏపీ,’ ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’ అంశాలను చంద్రబాబు బృందం ప్రచారం చేయనుంది. సిఎం పర్యటనకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు.
దావోస్ లో జరగనున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ 46వ సదస్సుకు భారత్ నుంచి హాజరవుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు, ఈ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. భారత్ నుంచి ఈ సదస్సుకు కేవలం ముగ్గురు ప్రముఖులు మాత్రమే హాజరవుతున్నారు. వీరిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ వుండగా, మరొకరు ఏపీ సిఎం చంద్రబాబు ఉన్నారు.
దావోస్ పర్యటనలో భాగంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ జాబితాలో నెస్లే, జాన్సన్ కంట్రోల్, ట్రినా సోలార్, సీమెన్స్, మెకిన్సే, లాక్ హీడ్ మార్టిన్- ఎయిర్ బస్, అక్కియోనా ఎనర్జీ, స్పెయిన్, జెట్రో, ఉబెర్, హాన్యా క్యూ సెల్స్, ఫిలిప్స్, అంట్ వెర్ప్ ఫోర్ట్ అథారిటీ, స్విస్ రీ, రోనాల్డ్ బెర్గర్, హ్యూలెట్ పాకార్డ్, ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, మారియట్ ఇంటర్నేషనల్, మెడ్ ట్రానిక్స్, సేల్స్ ఫోర్స్, ఇంటర్ కాంటినెంటల్ హోటల్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.





