చెన్నై అంతా వరద నీరే… కానీ దేవాలయాల్లో మాత్రం..!

chennai temples not affected by flooded waterగత మూడు, నాలుగు రోజులు చెన్నై నగరం సముద్రాన్ని తలపించింది. ఏ దిక్కున చూసినా మోకాలి పైగా నీరు… బస్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులు వంటి ప్రభుత్వ కార్యాలయాలే కాదు, సాఫ్ట్ వేర్ సంస్థలు, భారీ అపార్ట్ మెంట్లు కూడా నీటిలో తేలియాడాయి. కానీ… ఇంత విపత్తు జరిగినా… చెన్నైలోని చాలా దేవాలయాలు వరద ముంపులో పడకపోవడం విశేషం.

వరద తీవ్రత ఎక్కువగా వున్నటువంటి మైలాపూర్ లోని కపాలీశ్వర ఆలయంలోకి ఒక్క చుక్క వరద నీరు కూడా చేరకపోవడం విశేషం. ఈ ఆలయానికి ముందు పెద్ద కోనేరు వుండడంతో చుట్టుపక్కల నీరు ఇందులోకి వచ్చి పొంగిపోర్లుతుందని స్థానికులు భావించారు. అయితే అలాంటి ఛాయలు కనపడక పోవడంతో చాలా మంది స్థానికులు ఈ దేవాలయంలో తల దాచుకున్నారు. చాలా విశాలంగా ఉండే ఈ ఆలయ ప్రాంగణం రోడ్డుకు ఎత్తులో వుండడం చేత వరద నీరు లోపలకు ప్రవేశించ లేదని చెబుతున్నారు.

అయితే ఈ ఆలయానికి సమీపంలోవున్న కేశవ పెరుమాళ్ల ఆలయంలోకి కూడా వరద నీరు ప్రవేశించ లేదు. అలాగే తెలుగు విద్యార్థులు అధికంగా వుండే ట్రిపుల్‌కేన్ ప్రాంతంలో పార్థసారథి స్వామి గుడి దగ్గరలో చెరువు ఉన్నా.. అక్కడికి కూడా వరద నీరు రాలేకపోవడం గమనార్హం. ఇవే కాకుండా చెన్నైలోని ముఖ్యమైన దేవాలయాల్లోకి నీరు రాలేదని స్థానికులు చెబుతున్నారు. చాలామందికి స్థానిక దేవాలయాలే పునరావాస కేంద్రాలుగా మారాయి. దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నలు ఎప్పుడూ ఆసక్తి కలిగించేదే గానీ, ఇలాంటి సందర్భాలలో మాత్రం “దేవుడే” తమని కాపాడాడని ప్రజలు భావించడం సహజమే కదా..!

ADVERTISEMENT
Latest Stories