ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విరుచుకుపడ్డారు. ‘గతంలో ఆంధ్రలో ఎకరం పొలం అమ్మితే.. తెలంగాణలో మూడెకరాలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రలో మూడెకరాలు వస్తోంది’’ అంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య పై ఆయన స్పందించారు.
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ సీఎం కేసీఆర్ గేలి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు సిగ్గనిపించడం లేదా? అని ఆయన నిలదీశారు. కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి… 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కేసీఆర్ జగన్ కు మద్దతు ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి వస్తే అన్ని రకాలుగానూ తెలంగాణ కు కలిసి వస్తుందనే కేసీఆర్ అలా చేశారని టీడీపీ విమర్శిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే… కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా సాగునీటి పథకాల పై పెట్టిన విశేష కృషి కారణంగా తెలంగాణలో పొలాల రేట్లు బాగా పెరిగాయి.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారగానే అమరావతి మార్పు… మూడు రాజధానులు, కొత్త పెట్టుబడులు రాకపోవడం వంటి అనేక కారణాల వల్ల రియల్ రంగం కుంటుపడింది. ప్రాజెక్టుల విషయంలో పెద్దగా ప్రోగ్రెస్ లేకపోవడంతో పొలాల రేట్లు కూడా తగ్గాయి. కేసీఆర్ అన్న మాటలకు ఇదే కారణం!



