సోమవారం ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్ధులు, యువత పలువురు ప్రముఖులు పాల్గొని ‘నీట్’ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
తమకు రాజకీయాలతో, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కాక్రోచ్ జనతా పార్టీ చెప్పుకుంటోంది. కానీ దాని ఆందోళనలో బిజేపిని, ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ వంటి పలువురు పాల్గొనడం, వారు యువతని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం గమనిస్తే, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక, ఈ ఆందోళనలు వెనుక ఖచ్చితంగా బిజేపి-మోడీ వ్యతిరేక శక్తులు ఉన్నాయని స్పష్టమవుతుంది.
లేకుంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇన్ని వేలాదిమంది స్వచ్చందంగా తరలిరావడం కష్టమే. కనుక ఈ ఆందోళనలకు అవసరమైన నిధులు, సహాయ సహకారాలు ఎవరు అందించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
వారికి ఆ శ్రమ లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎంపీలు, సీనియర్ నేతలు ప్రధాని మోడీ నివాసం ఎదుట కూర్చొని ధర్నా చేశారు. ప్రధాని మోడీ తక్షణం రాజీనామా చేయాలనేది వారి డిమాండ్.
కనుక కాక్రోచ్ జనతా పార్టీ అధ్వర్యంలో నిన్న జరిగిన ఆందోళనలు కేవలం నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ సమస్యకే పరిమితమని, అది రాజకీయాలకు, పార్టీలకు అతీతమని అనుకోలేము.
ఇలాంటి రాజకీయ చదరంగంలో ఓడినా గెలిచినా ఆ పార్టీలకు పెద్ద సమస్య కాదు. నిజానికి అవి రోజూ ఆడుకునే ఆటే ఇది. కానీ వాటి చదరంగంలో యువత, విద్యార్ధులు పావులుగా మారితే తీవ్రంగా నష్టపోతారు. కనుక తమని ప్రేరేపిస్తున్నవారి ఆలోచనలను పసిగట్టి విచక్షణతో వ్యవహరించడం చాలా మంచిది.




