ఇటీవలే వైసీపి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి ‘ఆడుదాం ఆంద్రా’ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ‘క్రీడా స్పూర్తి’ ఉండాలని నొక్కి చెప్పారు.
వైసీపి ‘క్రీడా స్పూర్తి’ని తట్టుకోలేక అంబటి రాయుడు దణ్ణం పెట్టి బయటకు వచ్చేశాడు. తాజాగా ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేత కూడా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ బలవంతంగా వాలంట్రీ రిటైర్మెంట్ చేయించేసింది. ఈ విషయం హనుమ విహారి స్వయంగా చెప్పారు.
ఇంతకీ ఆయన చేసిన నేరం ఏమిటంటే జట్టులోని 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి కార్పొరేటర్ కొడుకుని గ్రౌండ్లో ఉన్నప్పుడు పద్దతిగా మసులుకోవాలని హెచ్చరించడమే! ఓ టీమ్ జయాపజయాలకు పూర్తి బాధ్యత వహించే కెప్టెన్ తన టీమ్లో ప్లేయర్లను అవసరమైనప్పుడు ప్రోత్సహించడం, మందలించడం చాలా సహజమే.
మాస్టర్ బ్యాట్స్ మ్యాన్ సచిన్ టెండూల్కర్ అంతటివాడు ఆవిదంగా నేర్చుకొని పైకొచ్చినవాడే. కానీ జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న ఓ కుర్రాడు తాను ఓ కార్పొరేటర్ కొడుకుననే అహం ప్రదర్శించడం ఓ తప్పు అయితే, అతని ఫిర్యాదు చేయగానే జట్టు కెప్టెన్ అని కూడా చూడకుండా హనుమ విహారిపై ఒత్తిడి చేసి ఏకంగా జట్టు నుంచే తప్పుకునేలా చేయడం ఇంకా పెద్ద నేరం.
హనుమ విహారి ఏమీ గల్లీ క్రికెటర్ కాదు. అతను భారత్ తరపున 16 టెస్ట్ మ్యాచులు ఆడారు. ఆంధ్రా రంజీ జట్టుకి ఏడేళ్ళుగా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.
భారత్ జట్టులో మన ఆంధ్రా ఆటగాళ్ళకు సరైన గౌరవం, స్థానం లభించడం లేదని బాధపడుతుంటే, మన సొంత జట్టు కెప్టెన్ హనుమ విహారి పట్ల వైసీపి నాయకులు ఈ విదంగా వ్యవహరించడం చాలా దారుణం.
ఈ ఘటనపై హనుమ విహారి స్పందిస్తూ, “అసోసియేషన్ వల్లనే మేము క్రికెట్ ఆడుతున్నామని భావిస్తుంటుంది. కనుక అది చెప్పిన్నట్లే మేమందరం నడుచుకోవాలని భావిస్తుంటుంది. నేను ఆ ఆటగాడితో అనుచితంగా మాట్లాడలేదు. కానీ అతని ఫిర్యాదు చేయడంతో నన్ను కెప్టెన్సీ నుంచి తప్పుకోమని అసోసియేషన్ ఆదేశించింది.
దీనిని నేను చాలా అవమానంగా భావిస్తున్నాను. నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినందున ఇకపై ఆంధ్రా జట్టు తరపున ఎన్నడూ ఆడకూడదని నిర్ణయించుకున్నాను.
ప్రతీ మ్యాచ్తో మా జట్టు రాణిస్తున్నతీరు నాకు చాలా సంతృప్తినిస్తోంది. కానీ అసోసియేషన్కు మా ఎదుగుదల నచ్చడం లేదు,” అంటూ హనుమ విహారి తాను ఎదుర్కొన్న అవమానాన్ని, మనోవేదనను తెలియజేస్తూ సోషల్ మీడియాలో చాలా భావోద్వేగంతో ఓ లేఖ పోస్ట్ చేశారు.




