గతేడాది అక్టోబర్ సమయంలో… దర్శకుడు తేజ ఒక వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై ఆసక్తికరమైన ప్రకటనలు చేసారు. తానూ స్టార్ హీరోలను డైరెక్ట్ చేయలేనని, రజనీ, కమల్, అమితాబ్, మహేష్ వంటి హీరోలనైతే డైరెక్ట్ చేయగలనని, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోల సినిమాలకు దర్శకత్వం తన వల్ల కాదని ఎలాంటి బేషజాలు లేకుండా చెప్పేసారు.
ఒకవేళ ఎలాంటి పరిస్థితులలో అయినా చిరంజీవి 150వ సినిమా తన వద్దకు చేరితే, ఆ సినిమాను ఒప్పుకోనని, అయితే అసలు రాదు అన్న విషయం తనకు తెలుసని, ఒకవేళ వచ్చినా తానూ అంగీకరించనని, చిరంజీవి ఒక గిరి గీసుకుని అందులోనే ఉండిపోతారని… ఓ ఆరు పాటలు, అయిదు పాటలు, కామెడీ సన్నివేశాలు… ఇలాంటి లెక్కలు కొన్ని ఉంటాయని, వాటిని లెక్కించి సినిమాలు తీయడం తన వల్ల కాని పని అని అన్న తేజ, ఒకవేళ చేయాల్సి వస్తే రీమేక్ సినిమా వైపుకు మొగ్గు చూపాలి అంటూ సమాధానం ఇచ్చారు.
తేజ ఆ ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి “కత్తి” రీమేక్ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినా గానీ మెగాస్టార్ ఆలోచనలను సరిగ్గా తెలుసుకున్న వ్యక్తిలా.., చిరు ఎలాంటి కధలకు ఓకే చెప్తాడో, ఎలాంటి కధలను అంగీకరించరో అన్న విషయం బాగా స్పష్టంగా తెలిసినట్లుగా చెప్పారు. అక్కడ నుండి సీన్ కట్ చేస్తే… మరో మూడు, నాలుగు మాసాల తర్వాత ‘కత్తి’ రీమేక్ లో నటించబోతున్నారంటూ చిరు తనయుడు రామ్ చరణ్ ఒక అధికారిక వార్తను అందించారు. దీంతో చిరు ఆలోచనలను ముందుగానే అంచనా వేయడంలో తేజ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడంటూ తాజాగా సదరు సంగతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
రాంగోపాల్ వర్మ శిష్యుడిగా ఎదిగిన తేజ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ వర్మకు విపరీతంగా నచ్చడంతో మళ్ళీ ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చలోకి వచ్చింది. దీంతో చిరు 150వ సినిమా కధను ఒక రీమేక్ మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. అంటే తేజ చెప్పినట్లు మెగాస్టార్ చిరంజీవి ‘స్టార్ ఇమేజ్’ అనే చట్రంలో బందీ అయిపోయారని స్పష్టం అవుతోంది. చిరు కోసం “ఊయ్యాలవాడ నరసింహారెడ్డి” కధను సిద్ధం చేసామని, అయితే చిరు మాత్రం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, రీమేక్ కే మొగ్గు చూపారని ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు కూడా తేజ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.



