ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగానే హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మూడు పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాగా విడుదలైన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ గా నిలిచింది. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోల్చుకుంటే, వచ్చిన ధియేటర్ కలెక్షన్స్ మరియు శాటిలైట్ హక్కులు కలిపితే, శర్వానంద్ కెరీర్ లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించారు.
తాజాగా ఈ సినిమా మే 15వ తేదీన బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో బుల్లితెరపై మొదటగా ప్రదర్శితం కాబోయే సినిమా కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే కావడం విశేషం. క్రైమ్ కామెడీ నేపధ్యంలో సాగిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సినిమా హిట్, ఫ్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా, శాటిలైట్ హక్కులను అత్యధిక ధరలను పెట్టి కొనుగోలు చేయడం వలన టెలివిజన్ లలో వెంటనే ప్రదర్శించేస్తున్నారు.





