పండగ సీజన్ దసరా, సంక్రాతి ఇలా విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవలు ఎక్కువగా దొరికే ఈ పండుగలను ఎవరికీ వారు వారి స్వగ్రామాలలో, వారి సొంత కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊర్లకు బయలుదేరతారు.
అయితే ఈ అవకాశాన్ని అదునుగా చేసుకుని ప్రవైట్ ట్రావెల్స్ తమ దందాను మొదలు పెడుతుంది. నిన్నటి దాకా 500 రూ. ఉన్న ఛార్జ్ ఈ రోజుకి అమాంతం 1200, అవకాశం ఉంటే 1500 కూడా మారిపోతుంది.
ఇదంతా ప్రతి ఏడాది జరిగే తంతే అని సరిపెట్టుకున్నా ఏడాదికేడాది ఈ దందా పరిధి పెరుగుతూ వస్తుంది. అయినా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఈ ప్రయివేట్ ట్రావెల్స్ పండగ దందాకు చెక్ పెట్టలేకపోతున్నారు.
సొంత వారితో ఈ పండగ సరదాలు జరుపుకోవాలి అనుకున్నవారికి ఈ సరదా చాల కాస్టలీగా మారుతుంది. ఒక కుటుంబం మొత్తం కలిసి వారి సొంత ఊళ్లకు వెళ్లాలంటే రానూపోనూ ట్రావెలింగ్ ఖర్చులే తక్కువలో తక్కువ10 వేలు పక్కా అనే లెక్కలోకి వెళ్లిపోయారు సామాన్యులు.
సెలవలు, పండుగ సంబరాలు సొంతవారితో జరుపుకోవాలి అనే ఆలోచనలో ప్రజలు ఉంటే, సీజన్లోనే దండిగా దండుకుందాం అనే ధోరణిలో ట్రావెల్స్ యాజమాన్యం ఉంటున్నారు.
ఈ పండుగ సీజన్ లో అధికంగా చార్జీల ధరలు పెంచడమే కాదు కండిషన్ లో లేని వాహనాలను కూడా డబ్బుకి ఆశపడి రోడ్ల మీదకు తెస్తారు. ప్రయాణికుల ప్రాణాలను గాలిలో ఉంచుతారు. అయితే వీటి మీద పూర్తి కంట్రోల్ ఉండేలా ప్రభుత్వాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
అయితే దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు బయలుదేరే వారి కష్టాలు ఇలా కాస్టలీ గా ఉంటే ఇక్కడ లోకల్ గా ఒక ఊరు నుండి మరో ఊరు వెళ్లే వారి ఆనందాలు ఉచితాలుగా ఉన్నాయి.
రాష్ట్రంలో లోకల్ గా ప్రయాణించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడ రేవంత్ సర్కార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది.
ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ఉచిత సౌకర్యాలను రెండు రాష్ట్రాల మహిళలు అవసరానికి మించి వినియోగించుకుంటున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలా పండుగ సీజన్ లో అయితే గుళ్ళు, గోపురాలు అంటూ ఉచిత ప్రయాణాలతో చేతిలో ఆధార్ కార్డు పట్టుకుని ఉరుకులు పరుగులు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల మహిళలు.







