భారతదేశ రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది. గతంలో మాదిరి రాజకీయ పార్టీలు సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి, ప్రభుత్వాల మెడలు మంచుతున్నాయి. తాజాగా అలా పుట్టుకొచ్చిన పార్టీనే ‘కాక్రోచ్ జనతా పార్టీ’.
నీట్ ఉద్యమంతో దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు మరికొంతమందికి ఆదర్శంగా మారిపోయింది. తమ 36 రోజుల ఉద్యమంతో మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టగలిగింది.
సీజేపీ నీట్ ఉద్యమం జీన్ జీ ల మద్దతు సంపాదించడంలో పూర్తిగా విజయం సాధించడంతో చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ కు పూర్తి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఉద్యమమే మరికొన్ని సమస్యల పరిష్కారానికి ఊతమిచ్చింది.
సీజేపీ పార్టీ తరహాలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలను ప్రభుత్వ పెద్దలకు వినిపించెదనుకు మరికొన్ని పార్టీలు పుట్టుకొస్తున్నాయి. దేశంలో ఉన్న ఒక్కో సమస్యకు ఒక్కో పార్టీ అన్నట్టుగా ఇప్పటికే దేశంలో కులాల వారీగా, మతాల వారికీ ప్రజలకు ఇచ్చే రిజర్వేషన్ల నిలిపేయాలంటూ “రిజర్వేషన్ హటావో ఆందోళన్” (RHA) పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం వేగంగా విస్తరిస్తుంది.
ఇక తాజాగా కేంద్రం ప్రతిపాదిస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ E20 ఇంధనం పై పోరాడేందుకు “E20 జనతా పార్టీ” పేరుతో మరోకొత్త పార్టీ సోషల్ మీడియాలో ఖాతా తెరిచింది. E20 పై పారదర్శకత ఉండాలని, మంత్రి గడ్కరీ రాజీనామా చెయ్యాలనే డిమాండ్ తో ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తుంది.
E20 ఇంధనం వాడకంతో వాహనాల మైలేజ్ విషయంలో, వాహనాల నాణ్యత విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రజలకు గతంలో మాదిరి ప్యూర్ ఇంధనం అందించాలనే డిమాండ్ వాహనదారుల నుంచి పెద్దఎత్తున వస్తుంది.
ఈ తరుణంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ E20 పెట్రోల్ కు సంబంధించిన విషయంలో తమ కుటుంబం లబ్ది పొందుతుందంటూ సోషల్ మీడియాలో తన పై, తన కుటుంబం పై తప్పుడు కథనాలు, డీప్ ఫేక్ వీడియో లు, పోస్టులు ప్రచారం చేస్తున్నారంటూ బాంబే హైకోర్టు ను ఆశ్రయించారు.
తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ మాదిరి E20 జనతా పార్టీ ని తక్కువ అంచనా వేయకుండా బీజేపీ పెద్దలు ఈ విషయంలో కాస్త ముందుగానే మేల్కొన్నారనే చెప్పాలి.
అయితే గతంలో మాదిరి ఇప్పుడు బీజేపీ ఏకచరాధిపత్యం చేయడానికి గాని, ఒంటెత్తు పోకడలకు పోవడానికి కానీ ఆస్కారం లేకపోవడం తో E20 పెట్రోల్ విషయంలో కేంద్ర బీజేపీ గతంలో మాదిరి దూకుడుగా ముందుకెళ్లే అవకాశం లేదు అనేది తాజా పరిస్థితులను బట్టి అంచనా వేయవచ్చు.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆరంభం మాత్రమే అని, ఇంకా ప్రభుత్వంలో పడాల్సిన వికెట్లు చాలానే ఉన్నాయంటూ సీజేపీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక భవిష్యత్ లో పుట్టుకురాబోతున్న పార్టీలకు, ఇప్పుడు సోషల్ మీడియాలో పురుడు పోసుకుంటున్న పార్టీలకు బీజేపీ పై పోరాడేందుకు సీజేపీ కేంద్ర బిందువు కానుందా అన్న చర్చ మొదలయ్యింది.



