అమరావతి – విజయవాడలను పర్యాటక హబ్ గా తయారు చేస్తానన్న ముఖ్యమంత్రి ప్రణాళికలు ఒక్కొక్కటిగా కార్యరూపం సిద్ధించుకుంటున్నాయి. ఇటీవల నది సొరంగ మార్గానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం, తాజాగా కృష్ణానదిలో తేలియాడే “ఫ్లోటింగ్ రెస్టారెంట్”ను ఏర్పాటు చేయడానికి గోవాకు చెందిన చాంపియన్ యాచ్ క్లబ్ ను ఎంపిక చేసింది.
పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునేందుకు కృష్ణానదిలో ఉన్న భవానీ ద్వీపం సమీపంలో నీటి అలలపై తేలియాడే రెస్టారెంట్ ను నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కాటేజీలను, రెస్టారెంట్లను రూపొందించిన చాంపియన్ యాచ్ క్లబ్ కే సదరు బాధ్యతలు అప్పగించనున్నారు. విజయవాడలో తిరిగేందుకు సరైన రహదారి వసతులే లేని నేపధ్యంలో గతంలో వచ్చిన “ఫ్లోటింగ్ రెస్టారెంట్, నదీ గర్భం గుండా రహదారి” వంటి అత్యాధునిక సదుపాయాలు కేవలం ప్రభుత్వం పబ్లిసిటీ వరకే పరిమితం అని నగర వాసులతో పాటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.
అయితే కాస్త సమయం తీసుకుంటున్నప్పటికీ తానూ అనుకున్న కార్యాన్ని, చెప్పిన పనులను చేయడంలో చంద్రబాబు చిత్తశుద్ధి స్పష్టంగా కనపడుతోంది. నిజానికి ఏపీకున్న ఆర్ధిక కష్టాలకు బహుశా మరొక ముఖ్యమంత్రి అయితే ఎప్పుడో చేతులెత్తేసే వారని పరిశీలకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఎలా ఉన్నా, కలలో కూడా ఊహించడానికి సాధ్యం కాని వాటిని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవేమీ పేపర్ వరకే పరిమితం కాకుండా వీలైనంత వేగంగా కార్యరూపం సిద్ధించాలని కోరుతున్నారు





