ప్రస్తుతం చెన్నైను కుదిపేసిన వరదలు, రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్నాయా? అంటే ముమ్మాటికీ అవుననే అంటోంది ఐక్యరాజ్యసమితికి అందిన నివేదిక. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సమాజిక కమిషన్, ఆసియా- ఆఫ్రికా ప్రాంతీయ విపత్తుల హెచ్చరిక సహకార వ్యవస్థ సంయుక్తంగా రూపొందించిన ఓ నివేదికను ఐక్యరాజ్యసమితికి అందించాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణం మార్పుల (ఎల్నినో) వలన రానున్న మూడు నెలల్లో దక్షిణ భారతాన్ని భారీ నుండి అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.
భారత్లోని దక్షిణాది రాష్ర్టాలు, ఇండోనేషియాలోని ఈశాన్య ప్రాంతం సహా ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, కొలంబియాల్లో కొన్ని ప్రాంతాలపై జలగండం పొంచి వుందని సదరు నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే తమిళనాడును వరదలు బీభత్సం సృష్టించాయి. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తమిళనాడు కోలుకుంటోంది. గతంలో కంటే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడం వలన చెన్నైకు ఇంతటి విపత్తు సంభవించిందని, ఇదే ఎల్నినో ప్రభావం భవిష్యత్తులో కూడా కొనసాగే సూచనలు కనపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల వాట్సప్, పేస్ బుక్ లలో ‘నాసా’ పేరుతో పుకార్లు షికారు చేయడంతో వరదలకు సంబంధించిన సమాచారం ‘లైట్’గా మారిపోయింది. కానీ, ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వార్తలు పక్కా నివేదికల ప్రకారం రావడంతో కాస్త అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి మానవుడికి లేదు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏపీ అయినా, అమెరికా అయినా అతలాకుతలం కావల్సిందేనని గత అనుభవాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం డిసెంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు ఉంటుందని అంచనా. ఈ ఎల్నిలో వలన తమిళనాడుకే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటకలకు జలగండం రూపంలో ముప్పు ఉందని ఇచ్చిన నివేదిక ఎంత వరకు ఉపయోగపడుతుందో, ప్రభుత్వాలు ఎంత వరకు వినియోగించుకుంటాయో చూడాలి.





