ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నిరాశపరచిందని జగన్ రాశారు.
అయితే దీనిపై బీజేపీ ఎంపీ, జాతీయ ప్రతినిధి జీవీఎల్ నరసింహ రావు ఘాటుగా స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోదా అనే లేని వ్యవస్థపై ఇంకా మాట్లాడితే రాజకీయంగా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. హోదాపై రాజకీయం చేయాలని చూస్తే గత సర్కార్ లా వైఎస్సార్ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందన్నారు.
ఏ రాష్ట్రానికి ఇవ్వనట్లుగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని వివరించారు. హోదాకు బదులుగా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా రూ.22వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కేంద్రానికి ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఉద్దేశం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని జగన్ కు కూడా తెలుసని అన్నారు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే అది మీ మెడకే చుట్టుకుంటుంది అని బీజేపీ జగన్ ని పరోక్షంగా హెచ్చరించిందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ పెట్టిన వెంటనే జగన్ దీనిపై స్పందించలేదు. ఒకింత జాగ్రత్తగానే మీడియా ముందుకు కూడా రాకుండా లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. అయినా బీజేపీ దానిని సీరియస్ గా తీసుకునట్టుగానే కనిపించింది.



