స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఊరూవాడ ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.
ప్రపంచంలో అనేక దేశాలలో ఒకే మతం లేదా ఒకే భాష ఉంటుంది. కానీ అనేకానేక కులమతాలు, భాషలు, పూర్తి భిన్నమైన సంస్కృతులతో నిండిన భారత్లో వాటన్నిటికీ అతీతంగా జరుపుకుంటున్న ఈ జాతీయ పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది.
నూట నలబై కోట్లకు పైగా ఉన్న దేశజనాభాని ఇలాంటి జాతీయ పండుగలు పూలదండలో దారంలా కలిపి ఉంచుతున్నాయని నిరూపితమవుతోంది. ఇలాంటి సందర్భాలలో ప్రజలలో దేశభక్తి ఇంత విస్పష్టంగా కనిపిస్తున్నందుకు చాలా సంతోషం.
మన దేశంలో రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఏవిధంగా వ్యవహరిస్తున్నా, ఈ 79 ఏళ్ళలో భారత్ అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చెందిందనేది వాస్తవం.
కనుక పాలకులు, ప్రభుత్వాల వలన జరిగిన అభివృద్ధి 60 శాతం అనుకుంటే మిగిలిన 40 శాతం కాలక్రమంలో వివిధ రంగాలలో సంస్థలు, ప్రముఖులు, దేశ ప్రజల వలన జరిగిందని భావించవచ్చు.
అదే… మన పాలకులు కూడా ఆర్ధిక, రాజకీయ క్రమశిక్షణ పాటిస్తూ పాలన సాగించి ఉండి ఉంటే, బహుశః నేడు ‘ఒక రూపాయికి ఎన్ని అమెరికా డాలర్లు?’ అని ప్రపంచం లెక్క కట్టుకునే సమున్నత స్థితిలో ఉండేది మన దేశం.
నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకలు, దేశ ప్రజలలో పొంగిపొరలుతున్న దేశభక్తి చూస్తున్నప్పుడు, ‘అంతా బాగానే ఉంది’ అనిపిస్తుంది.
కానీ రాజకీయాలు కావచ్చు.. ప్రభుత్వాలు కావచ్చు.. ప్రజలు కావచ్చు… ప్రతీ చోట సమస్యలు, సవాళ్ళు పేరుకుపోతూనే ఉన్నాయి.
ఒకప్పుడు దేశప్రజలు కులమతాలు, భాషలు ప్రాంతాలుగా విడిపోయేవారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా విడిపోయి, తమకు సంబంధం లేని పార్టీలు, నాయకుల కోసం పరస్పరం కత్తులు దూసుకోవడమే బాధ కలిగిస్తుంది.
ఇలాంటి సమస్యలన్నిటినీ భుజంపై మోసుకుంటూ భారత్ మెల్లగా అభివృద్ధి పధం వైపు అడుగులు వేస్తోంది.. తప్ప ఎక్కడా ఆగిపోవడం లేదు. ఇందుకు సంతోషించాల్సిందే!




