సఫారీలతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ను కూడా టీమిండియా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రెండవ రోజు ఆటలో రెహానే సెంచరీ మరియు జడేజా 5 వికెట్లు హైలైట్స్ గా నిలిచాయి. 89 పరుగుల వ్యక్తిగత స్కోరు నుండి బ్యాటింగ్ కొనసాగించిన రెహానే 127 పరుగులు చేసి అవుటయ్యాడు. స్పిన్నర్ అశ్విన్ కూడా బ్యాట్ కు పని చెప్పడంతో భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. అశ్విన్ 56 పరుగులు చేసి అవుటవ్వగా టీమిండియా 334 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇక, బ్యాటింగ్ ఆరభించిన సఫారీలు క్రీజులో నిలద్రోక్కుకోవడానికి కష్టపడ్డారు. మొదటి వికెట్ ను 36 పరుగుల వద్ద కోల్పోగా, చివరి వికెట్ ను 121 పరుగుల వద్ద కోల్పోయింది. డివిలియర్స్ ఒక్కడే కాస్తంత సేపు క్రీజులో ఉండి 42 పరుగులు చేయగా, ఏడుగురు బ్యాట్స్ మెన్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 2, ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 1 వికెట్ సొంతం చేసుకున్నారు.
213 పరుగులు వెనుకబడడంతో ఫాలో ఆన్ ఆడిస్తుందని అంచనా వేసినప్పటికీ, భారత్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికే నిర్ణయించుకుంది. రెండవ ఇన్నింగ్స్ లో కనీసం 200 పరుగులు చేసినా సఫారీలకు 400 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలుగుతారు. భారత స్పిన్నర్లను ఎదుర్కొని ఈ పిచ్ పై 400 పరుగులు చేయడమంటే అంత సులువైన పని కాదు. దీంతో సిరీస్ 3-0 తేడాతో టీమిండియా వశం అయిపోయిందని భారత అభిమానులు ఫిక్సయిపోయారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలు కావాలంటే ఏదైనా ‘అద్భుతం’ జరగాల్సిందే అంటున్నారు క్రికెట్ పండితులు.





